Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర.. తక్కువ ధరలో ఎక్కువ టూర్లు!

నార్త్ ఇండియాలోని ఫేమస్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఐఆర్‌‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర.. తక్కువ ధరలో ఎక్కువ టూర్లు!
X

ఐఆర్‌‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర.. తక్కువ ధరలో ఎక్కువ టూర్లు!

నార్త్ ఇండియాలోని ఫేమస్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునేవాళ్ల కోసం ఐఆర్‌‌సీటీసీ తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్‌‌లో ఒడిశా, యూపీ, బీహార్ రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను కవర్ చేయొచ్చు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ‘పుణ్యక్షేత్ర యాత్ర’ టూర్‌ను తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ రైలులో సాగే ఈ టూర్.. అక్టోబర్ 12న మొదలవుతుంది. తొమ్మిది రోజులుండే ఈ టూర్‌‌లో.. పూరి, కోణార్క్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌, గయ వంటి పలు పుణ్యక్షేత్రాలను చూసి రావొచ్చు.

ప్రయాణం ఇలా..

ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీని బుక్ చేసుకున్న పర్యాటకులు కాజీపేట్, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి , సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల నుంచి రైలు ఎక్కొచ్చు. మొదటి రోజంతా రైలు ప్రయాణమే ఉంటుంది. రెండో రోజు ఒడిశాలోని మాల్తిపాత్పూర్‌లో దిగి, అక్కడ్నుంచి పూరి వెళ్తారు. అక్కడ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుని రాత్రికి పూరిలో స్టే చేస్తారు. మూడో రోజు ఉదయాన్నే పూరి నుంచి కోణార్క్ బయలుదేరతారు. కోణార్క్‌లో సూర్యదేవాలయాన్ని చూసుకుని సాయంత్రానికి గయ బయలుదేరతారు. నాలుగో రోజు ఉదయానికి గయ చేరుకుంటారు. గయలో బోధ్ గయ, మహాబోధి ఆలయం, విష్ణుపాద ఆలయం వంటివి చూసుకుని ఆరోజు రాత్రికి గయలో స్టే చేస్తారు. ఐదో రోజు ఉదయాన్నే వారణాసికి బయలుదేరతారు. అక్కడ సార్‌నాథ్‌ స్థూపాన్ని చూసుకుని రాత్రికి వారణాసిలో స్టే చేస్తారు. ఆరో రోజు ఉదయాన్నే కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు వారణాసి కారిడార్‌‌లోని ఇతర ఆలయాలను సందర్శిస్తారు. తర్వాత గంగా హారతి చూసుకుని సాయంత్రానికి అయోధ్య బయలుదేరతారు. ఏడో రోజు అయోధ్య టూర్ ఉంటుంది. అక్కడ రామజన్మభూమి, హనుమాన్‌గఢి వంటివి చూసుకుని సరయూ నదీతీరంలో హారతి దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రికి ప్రయాగ్‌రాజ్ బయలుదేరతారు. ఇక ఎనిమిదో రోజు ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, విమాన్ మండపం వంటివి చూసుకుని హైదరాబాద్‌కు రిటర్న్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర ప్యాకేజీ ధరలు రూ.16,400 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ క్లాస్ ధర రూ.16,400.. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.25,500.. కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.33,300గా ఉన్నాయి.

ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణం, హోటల్ స్టే, వాహనాల్లో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. బుకింగ్స్ కోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctctourism.com) విజిట్ చేయొచ్చు.

First Published:  11 Sep 2023 11:31 AM GMT
Next Story