Telugu Global
Telangana

ప్రచార బరిలో విజయశాంతి.. రోడ్ షో లతో హడావిడి మొదలు

ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు విజయశాంతి. బహిరంగ వేదికపై ఆమె ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో వేచి చూడాలి.

ప్రచార బరిలో విజయశాంతి.. రోడ్ షో లతో హడావిడి మొదలు
X

కాంగ్రెస్ కండువా కప్పుకున్నా కూడా వెంటనే విజయశాంతి హడావిడి చేయలేదు. ప్రచార పర్వంలో దిగేందుకు ఆమె ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇటీవల ఆమెను క్యాంపెయిన్ అండ్ ప్లానింగ్ కమిటీ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌ గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ కమిటీలో ఉన్న సభ్యులకు ఆమె ఇన్ చార్జ్ గా ఉంటారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా కేవలం ట్విట్టర్లోనే కామెంట్లు పెడుతున్న విజయశాంతి మంగళవారం నుంచి ప్రచార పర్వంలో పూర్తి స్థాయిలో దిగబోతున్నారు. ఆమె రోడ్ షో లు మంగళవారం నుంచి మొదలవుతాయని తెలుస్తోంది.

మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావుకు మద్దతుగా విజయ శాంతి రోడ్ షో ద్వారా ప్రచారం కోసం వస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రోహిత్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. విజయ శాంతి రోడ్ షో ను విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు.

బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ లోకి వెళ్లి తనకు, తన కొడుక్కి రెండు టికెట్లకోసం మైనంపల్లి హన్మంతరావు బాగానే చదివించుకున్నారని వినికిడి. తనకంటే తన కొడుకు విజయంకోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు విజయశాంతిని కూడా తన కొడుకు రోడ్ షో కోసం ప్రత్యేక రిక్వెస్ట్ మీద పిలిపిస్తున్నారని సమాచారం. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు విజయశాంతి. బహిరంగ వేదికపై ఆమె ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో వేచి చూడాలి.

*

First Published:  20 Nov 2023 5:17 AM GMT
Next Story