Telugu Global
Telangana

అమెరికాలో తెలుగు విద్యార్థుల హఠాన్మరణం..

వనపర్తికి చెందిన దినేశ్‌ అమెరికాకు వెళ్లింది కూడా డిసెంబర్‌ 28నే. వెళ్లిన 17 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వవిద్యాలయం (ఎస్చయ్య)లో ఎంఎస్‌ చదివేందుకు దినేశ్‌ అక్కడికి వెళ్లాడు

అమెరికాలో తెలుగు విద్యార్థుల హఠాన్మరణం..
X

అమెరికాకు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఒకే గదిలో నిద్రిస్తున్న ఇద్దరూ నిద్రలోనే మృతిచెందారని చెప్పడంపై వారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విష వాయువు పీల్చడం వల్లే ఇద్దరూ చనిపోయి ఉంటారా..? ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా..? ఈ ఘటన వెనుక కారణాలేమిటనేది మిస్టరీగా ఉంది.

శనివారం రాత్రి ఈ ఘటనపై ఆదివారం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మృతిచెందిన విద్యార్థుల్లో ఒకరు వనపర్తి పట్టణంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్‌ (23). మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిగా తెలుస్తోంది.

వనపర్తికి చెందిన దినేశ్‌ అమెరికాకు వెళ్లింది కూడా డిసెంబర్‌ 28నే. వెళ్లిన 17 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వవిద్యాలయం (ఎస్చయ్య)లో ఎంఎస్‌ చదివేందుకు దినేశ్‌ అక్కడికి వెళ్లాడు. ఈ ఘటనపై సమాచారాన్ని దినేశ్‌ తండ్రి గట్టు వెంకన్న విలేకరులకు వెల్లడించారు.

ఒకే గదిలో నిద్రిస్తున్న విద్యార్థులిద్దరూ నిద్రలోనే మృతిచెందినట్టు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు.

First Published:  15 Jan 2024 3:12 AM GMT
Next Story