Telugu Global
Telangana

వర్గీకరణ హామీ ముమ్మాటికీ మోసం.. దళితబంధుకే జై

అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ 29 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు టీఎమ్మార్పీఎస్ నేతలు. దళితబంధుతో తమ జీవితాలను మార్చేసిన బీఆర్ఎస్ కి రుణపడి ఉంటామన్నారు.

వర్గీకరణ హామీ ముమ్మాటికీ మోసం.. దళితబంధుకే జై
X

ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విషయంలో ఇటీవల బీజేపీ, మాదిగ వర్గం వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసింది. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన మహా సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. వర్గీకరణకు ఆమోదం తెలిపారు, కమిటీ వేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ప్రధాని హామీ ఇచ్చినంత మాత్రాన వర్గీకరణ జరిగిపోతుందనుకోలేం. ఒకవేళ నిజంగానే ఆయనకు అంత సింపతీ ఉంటే.. మాటల్లో కాకుండా చేతల్లో చూపించేవారు. కమిటీ పేరుతో కాలయాపన చేసేవారు కాదు. కానీ వర్గీకరణకు సై అన్న మోదీకి ఎమ్మార్పీఎస్ మద్దతివ్వడమే ఇక్కడ విశేషం. అయితే ఈ ఏకపక్ష మద్దతుని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ లో చీలిక వచ్చింది. తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు బీజేపీ మాటల్ని మరోసారి నమ్మి మోసపోలేమని అంటున్నారు. దళితబంధుతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కే తమ మద్దతు అని తేల్చి చెప్పారు.

మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్‌ తోనే సాధ్యమవుతుందని అన్నారు టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. అందుకే తమ మద్దతు బీఆర్ఎస్ పార్టీ కేనని చెప్పారు వంగపల్లి. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని చెప్పారు.

అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ 29 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు టీఎమ్మార్పీఎస్ నేతలు. ఆ రెండు పార్టీలు మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకొంటూ అభివృద్ధిని, ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దళితబంధుతో తమ జీవితాలను మార్చేసిన బీఆర్ఎస్ కి రుణపడి ఉంటామన్నారు.


First Published:  20 Nov 2023 9:04 AM GMT
Next Story