Telugu Global
Telangana

కేసీఆర్ కి జై.. కేబినెట్ నిర్ణయంపై జైనుల హర్షం

తెలంగాణలో 2 లక్షలమందికి పైగా జైనులు ఉన్నారు. మైనార్టీలుగా వారికి ప్రభుత్వ రిజర్వేషన్లు అందుతున్నాయి. ఇప్పుడు వారికి మైనార్టీ కమిషన్లో కూడా చోటు దక్కింది.

కేసీఆర్ కి జై.. కేబినెట్ నిర్ణయంపై జైనుల హర్షం
X

తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై వివిధ వర్గాలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కులవృత్తులు చేసుకునేవారు, జర్నలిస్ట్ లు, వీఆర్ఏలు.. ఇలా కేబినెట్ నిర్ణయాలతో చాలామంది సంతోషంగా ఉన్నారు. వారిలో జైనులు కూడా ఉన్నారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ లో జైన్‌ సమాజానికి చెందిన ఒకరిని సభ్యులుగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణలో 2 లక్షలమందికి పైగా జైనులు ఉన్నారు. మైనార్టీలుగా వారికి ప్రభుత్వ రిజర్వేషన్లు అందుతున్నాయి. ఇప్పుడు వారికి మైనార్టీ కమిషన్లో కూడా చోటు దక్కింది. జైన వర్గం నుంచి ఒకరిని మైనార్టీ కమిషన్లో నియమించేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మైనార్టీ కమిషన్ లో తమ వర్గానికి అవకాశం ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్‌ లో ఉన్న ఈ నిర్ణయాన్ని కేబినెట్‌ సమావేశంలో ప్రకటించడం సంతోషకరం అని అంటున్నారు.

ఉత్తర భారతీయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని అంటున్నారు జైన వర్గం నాయకులు. ఉత్తర భారతీయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని కొనియాడారు. ఆలిండియా జైన్‌ మైనార్టీ ఫెడరేషన్‌ , రాజ్‌నీతి చేతన మంచ్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీలంతా బీఆర్ఎస్ కి అండగా ఉంటామన్నారు.

First Published:  19 May 2023 2:20 AM GMT
Next Story