Telugu Global
Telangana

కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు ఖాళీ.. ఎవరికి ఛాన్స్‌..?

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. దీంతో మిగిలిన ఆరు బెర్తుల్లో ఈ జిల్లాలకు చెందిన నాయకులకే దక్కే అవకాశాలున్నాయి.

కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు ఖాళీ.. ఎవరికి ఛాన్స్‌..?
X

తెలంగాణ కొత్త కేబినెట్‌లో మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఆరు మంత్రి పదవులు ఎవరికీ దక్కనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. గురువారం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు మినిస్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం పోటీ పడుతున్న వారి లిస్టు పెద్దదిగానే ఉంది. ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉమ్మడి ఖమ్మం నుంచి అత్యధికంగా ముగ్గురికి అవకాశం దక్కింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కేబినెట్‌లో ఉన్నారు. ఇక నల్గొండ నుంచి ఉత్తమ్‌, కోమటిరెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహలకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖలు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో అవకాశం దక్కలేదు. దీంతో మిగిలిన ఆరు బెర్తుల్లో ఈ జిల్లాలకు చెందిన నాయకులకే దక్కే అవకాశాలున్నాయి. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే కేవలం 4 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఇందులో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశమిచ్చారు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్నారు. అయితే మంత్రి వర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్లు ఉండటంతో.. ఈ ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది.

ఆదిలాబాద్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ జిల్లా నుంచి ఇద్దరికి లేదా ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రేసులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, షబ్బీర్ అలీ మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే మైనార్టీని కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తే షబ్బీర్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉంటే, ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర రాజధాని కావడంతో ఇక్కడి నుంచి కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ ఒక్క సీటు కోసం ఫిరోజ్‌ ఖాన్‌, అంజన్‌కుమార్‌‌ యాదవ్‌, మధు యాష్కిగౌడ్‌, మైనంపల్లి హన్మంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీళ్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. విజయం సాధించలేకపోయారు.

First Published:  8 Dec 2023 4:09 AM GMT
Next Story