Telugu Global
Telangana

`బాబాయ్‌` కృష్ణారావు ఇక‌లేరు

తెలుగు, ఇంగ్లిష్ దిన‌ప‌త్రిక‌ల్లో ఉన్న‌త హోదాల్లో ప‌నిచేశారు. రాజ‌కీయ విశ్లేష‌కుడిగానూ నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించిన కృష్ణారావు.. అంద‌రికీ `బాబాయ్‌`గా సుప‌రిచితులు.

`బాబాయ్‌` కృష్ణారావు ఇక‌లేరు
X

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) ఇక‌లేరు. గ‌తేడాది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. జ‌ర్న‌లిజం రంగంలో ఆయ‌న 47 ఏళ్ల పాటు విశేష‌మైన సేవ‌లందించారు. తెలుగు, ఇంగ్లిష్ దిన‌ప‌త్రిక‌ల్లో ఉన్న‌త హోదాల్లో ప‌నిచేశారు. రాజ‌కీయ విశ్లేష‌కుడిగానూ నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించిన కృష్ణారావు.. అంద‌రికీ `బాబాయ్‌`గా సుప‌రిచితులు. ఆయ‌న నిశిత‌మైన అంత‌ర్ దృష్టి, స‌త్యాన్వేష‌ణ‌, సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం.. అంతే ప‌దునైన వాగ్దాటితో పాత్రికేయ, రాజ‌కీయ రంగాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

1975లో ఒక స్ట్రింగ‌ర్‌గా నిరాడంబ‌ర‌మైన త‌న జ‌ర్న‌లిజం ప్ర‌స్థానాన్ని ప్రారంభించి.. త‌న ప్ర‌తిభ‌తో అతి త‌క్కువ కాలంలో ఉన్న‌త‌స్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్‌, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ సహా ఆయ‌న ప‌లు తెలుగు, తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో ప‌నిచేసి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్ర‌యాణం సాగించారు. అక్క‌డ 18 సంవ‌త్స‌రాల‌కు పైగా విధులు నిర్వ‌హించి అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన పాత్ర పోషించారు.

గ‌తేడాది క్యాన్స‌ర్ బారిన ప‌డిన కృష్ణారావు.. చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా జ‌ర్న‌లిస్టుగా సేవ‌లు అందించిన కృష్ణారావు మృతికి ప‌లు మీడియా సంఘాలు, తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, రాజ‌కీయ నేత‌లు సంతాపం తెలిపారు.

సీఎం కేసీఆర్ సంతాపం..

సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ఎంవీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో ఆయ‌న‌ చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని కేసీఆర్ తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయతీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని ముఖ్య‌మంత్రి అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సీఎం కేసీఆర్ తెలియజేశారు.

First Published:  17 Aug 2023 9:11 AM GMT
Next Story