Telugu Global
Telangana

ఓటు వేస్తూ సెల్ఫీ.. యువకుడిపై కేసు..!

పోలింగ్ సిబ్బంది కళ్లుగప్పి కొందరు లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లిన ఓ యువకుడు అత్యుత్సాహంతో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.

ఓటు వేస్తూ సెల్ఫీ.. యువకుడిపై కేసు..!
X

ఓటు వేసిన తర్వాత వేలికి ఉన్న ఇంక్ మార్క్ చూపిస్తూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అంశం. పోలింగ్ బూత్ బయటకు వచ్చి ఇలా సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడం అందరూ చేసేదే. కానీ ఓ కుర్రాడు ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకోవడంతోపాటు.. దాన్ని వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది అటు ఇటు తిరిగి ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఈసీ సూచనలతో పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారు.

కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రపురంలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు సెల్ ఫోన్ ను పోలింగ్ సిబ్బంది కంటపడకుండా బూత్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఈవీఎంపై వేలు పెట్టి ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

సెల్ ఫోన్లకు అనుమతి లేదు..

పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని ఈసీ ముందుగానే ఖరాఖండిగా చెప్పింది. పోలింగ్ బూత్ లోపల ఫొటోలు, సెల్ఫీలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలాంటి పని చేస్తే వారి ఓటు క్యాన్సిల్ చేయడంతోపాటు, కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధన వల్ల చాలామంది సెల్ ఫోన్లు బయటే ఉంచి పోలింగ్ బూత్ లోకి వెళ్లి వస్తున్నారు. పోలింగ్ సిబ్బంది కళ్లుగప్పి కొందరు లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్లిన ఓ యువకుడు అత్యుత్సాహంతో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.



First Published:  30 Nov 2023 10:35 AM GMT
Next Story