Telugu Global
Telangana

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా?

ఫిబ్రవరి 13న సికింద్రాబాద్‌లో ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నది. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులకు భూమి పూజ చేస్తారని గతంలో ప్రకటించారు.

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా?
X

ప్రధాని మోడీ ఈ నెల 13న పలు కార్యక్రమాల కోసం హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉన్నది. అయితే, బడ్జెట్ సమావేశాల్లో ఆయన బిజీగా ఉండటంతో హైదరాబాద్ పర్యటనపై సందిగ్దత నెలకొన్నది. మోడీ పర్యటన దాదాపు ప్రస్తుతానికి వాయిదా పడినట్లే అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్‌లో ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నది. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులకు భూమిపూజ చేస్తారని గతంలో ప్రకటించారు.

ఖాజీపేటలో నిర్మించతలపెట్టిన రైల్వే కోచ్ ఓవర్ హాలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కూడా చేయాల్సి ఉన్నది. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన నగరానికి 13న రావడం లేదని తెలుస్తున్నది. వీలుంటే వర్చువల్‌గా ఢిల్లీ నుంచే శంకుస్థాపనలు చేయడమో లేదంటే మరో తేదీన రావడమో జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ ప్రవాసి యోజన మీటింగ్స్ కోసం రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తున్నది. అయితే వీరిద్దరి పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారు కావల్సి ఉన్నదని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి. ప్రేమేందర్ రెడ్డి అన్నారు.

First Published:  3 Feb 2023 2:21 AM GMT
Next Story