Telugu Global
Telangana

నవదీప్ అబద్ధం చెప్పాడు.. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన నవదీప్.. తనకు డ్రగ్స్ తో సంబంధం లేదన్నాడు. ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా తనను విచారించారని, బీపీఎం పబ్‌ తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారన్నాడు.

నవదీప్ అబద్ధం చెప్పాడు.. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
X

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ని విచారించిన నార్కోటిక్ బ్యూరో అతడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుంది. అయితే నవదీప్ విచారణలో వాస్తవాలు దాచిపెట్టాడని, అబద్ధాలు చెప్పాడని అన్నారు యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో 81 లింకులు తాము గుర్తించామని, అందులో 41 లింకుల వివరాలను నవదీప్‌ తెలిపాడన్నారు. డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు గతంలో సిట్‌, ఈడీ విచారణలో నవదీప్‌ అంగీకరించాడని, ఇప్పుడు మాత్రం డ్రగ్స్‌ వాడలేదని సమాధానమిస్తున్నాడని అన్నారు.

రామ్ చంద్ కీలకం..

రామ్‌ చంద్‌ తో కలిసి నవదీప్‌ గతంలో బీపీఎం పబ్‌ నిర్వహించినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అప్పట్లో రామ్ చంద్ ద్వారా నవదీప్ కి డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయని పోలీసుల విచారణలో తేలింది. సిట్, ఈడీ విచారణ తర్వాత నవదీప్ తన ఫోన్ లో డేటా డిలీట్ చేశాడు. దీంతో ఇప్పుడు విచారణలో విషయాలు బయటపడలేదు. దీంతో నవదీప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్ పోలీసులు. డేటా రీట్రైవ్‌ చేసి మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు. నవదీప్‌ ఫోన్‌ డేటా పూర్తిగా వచ్చిన తర్వాతే మళ్లీ విచారణ ఉంటుందని తెలిపారు.

నవదీప్ ఏమన్నాడంటే..?

విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన నవదీప్.. తనకు డ్రగ్స్ తో సంబంధం లేదన్నాడు. నార్కోటిక్‌ బ్యూరో అధికారులు.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇస్తే వచ్చానన్నాడు. ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా తనను విచారించారని, బీపీఎం పబ్‌ తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారన్నాడు. రామ్ చంద్‌ తో పరిచయం ఉంది. కానీ, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదన్నాడు నవదీప్. తాను ఎప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్‌ తీసుకోలేదన్నాడు.

First Published:  23 Sep 2023 6:38 PM GMT
Next Story