Telugu Global
Telangana

మహారాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ చెణుకులు

డబుల్ ఇంజిన్ ఇప్పుడు పాతబడిపోయిందని, ట్రిపుల్ ఇంజిన్ అనే కొత్త టెక్నాలజీ వచ్చిందన్నారు. ట్రిపుల్ ఇంజిన్స్ పవర్డ్ బై వాషింగ్ మెషిన్స్ అంటూ బీజేపీని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

మహారాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ చెణుకులు
X

మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. డబుల్ ఇంజిన్ ఇప్పుడు పాతబడిపోయిందని, ట్రిపుల్ ఇంజిన్ అనే కొత్త టెక్నాలజీ వచ్చిందన్నారు. ట్రిపుల్ ఇంజిన్స్ పవర్డ్ బై వాషింగ్ మెషిన్స్ అంటూ బీజేపీని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి రెట్టింపు స్థాయిలో జరుగుతుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ తో మోతమోగిపోతుందనేది ఆ పార్టీ వాదన. అయితే డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో కనపడుతోంది. సింగిల్ ఇంజిన్ అయినా తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. దీని ముందు డబుల్ ఇంజిన్ బలాదూర్ అని గతంలో చాలా సార్లు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇప్పుడు బీజేపీ మరో అడుగు ముందుకేసింది, మహారాష్ట్రలో బీజేపీ, శివసేన చీలిక వర్గం ఇదివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకుంటే, దీనికిప్పుడు ఎన్సీపీ చీలిక వర్గం కలిసింది. అంటే టోటల్ గా ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అని అంటున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. ఈ ట్రిపుల్ ఇంజిన్ పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై సెటైర్లు పేల్చారు.


వాషింగ్ మెషిన్..

అప్పటి వరకూ అవినీతి పరులైన రాజకీయ నాయకులు బీజేపీలో చేరితే మాత్రం పునీతులవుతారనేది ఆ పార్టీ సిద్ధాంతం. పశ్చిమబెంగాల్ లో ఇలా చాలామంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరి కేసుల బాధల నుంచి తప్పించుకున్నారు. ఏ రాష్ట్రంలో అయినా స్థానిక పార్టీలను టార్గెట్ చేయాలంటే బీజేపీ ముందుగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంది. కేసులు పెట్టి వేధిస్తుంది, ఆ తర్వాత వారు బీజేపీలో చేరగానే కేసుల కథ కంచికి చేరుతుంది. తాజాగా ఎన్సీపీ విషయంలో కూడా బీజేపీ అదే వ్యూహం అమలు చేసిందని శరద్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ఎన్సీపీ పని అయిపోయిందని, అందులో అందరూ అవినీతిపరులేనని ప్రధాని మోదీ ఆరోపించారని, ఆ తర్వాత దర్యాప్తు సంస్థల వేధింపులు మొదలయ్యాయని, ఆ వెంటనే అజిత్ పవార్ వర్గం ఒత్తిడి తట్టుకోలేక బీజేపీతో చేతులు కలిపిందన్నారు శరద్ పవార్. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే విషయంలో కౌంటర్లిచ్చారు. ఇది వాషింగ్ మెషిన్లు అందించే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని వెటకారం చేశారు.

First Published:  3 July 2023 4:49 AM GMT
Next Story