Telugu Global
Telangana

ర్యాలీలో అపశృతి.. మంత్రి కేటీఆర్ కు గాయాలు

ఆర్మూర్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు.

ర్యాలీలో అపశృతి.. మంత్రి కేటీఆర్ కు గాయాలు
X

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మంత్రి కేటీఆర్ చేపట్టిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ప్రచార రథంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. వాహనం పైనుంచి పడిపోయారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. మంత్రి కేటీఆర్ సహా ఇతర నాయకులు ప్రచార వాహనంపైన నిలబడి అభివాదం చేస్తున్నారు. ఆ వాహనం స్పీడ్ గా ముందుకు వెళ్తోంది. ఇంతలో అక్కడ కరెంటు తీగ అడ్డుగా ఉండటంతో వారి వాహనానికి ముందు ఉన్న వాహనాన్ని సడన్ గా ఆపివేశారు. దీంతో నాయకులు ఉన్న వాహనం డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేశారు. వాహనం అదుపు తప్పడంతో పైన నిలబడి ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక్కసారిగా కిందకు వాలిపోయారు. నాయకులకు అడ్డుగా పెట్టి ఉన్న రెయిలింగ్ విరిగిపోవడంతో వారు ఒక్కసారిగా ముందుకు పడిపోయారు.

నేను క్షేమం..

ఆర్మూర్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు. ఈ ఘటనలో ఎంపీ సురేష్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన పూర్తిగా కిందపడిపోయారు. మంత్రి కేటీఆర్ ని భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో ఆయన పడిపోకుండా ముందుకు ఒరిగిపోయి నిలదొక్కుకోగలిగారు.

ఈరోజు మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రగతి భవన్ లో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన సిరిసిల్లకు వచ్చి అక్కడ నామినేషన్ వేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కి వెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలోనే అపశృతి చోటు చేసుకుంది. అనంతరం ఆర్మూర్ నుంచి కొడంగల్ ర్యాలీకోసం బయలుదేరి వెళ్లారు మంత్రి కేటీఆర్.

First Published:  9 Nov 2023 10:14 AM GMT
Next Story