Telugu Global
Telangana

రాజాసింగ్‌పై పోటీ వద్దన్న అసదుద్దీన్..!

గోషామహల్‌ నుంచి కరుడు గట్టిన హిందుత్వవాది, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ బరిలో ఉన్నారు. కాషాయం పార్టీ అంటేనే ఒంటి కాలిపై లేచే అసదుద్దీన్.. ఇవాళ రాజాసింగ్‌పై అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదనే చర్చ జోరుగా జరుగుతోంది.

రాజాసింగ్‌పై పోటీ వద్దన్న అసదుద్దీన్..!
X

హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ డామినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ పార్లమెంట్‌ పరిధిలో ఏ అభ్యర్థిని నిలబెట్టినా అలవోకగా గెలుస్తారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు ప్రచారం చేయడానికి కూడా MIM ఒప్పుకోదు. హైదరాబాద్‌లో ఇంత పట్టున్న MIM.. గోషామహల్‌లో పోటీ చేయకపోవ‌డం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

గోషామహల్‌ నుంచి కరుడు గట్టిన హిందుత్వవాది, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ బరిలో ఉన్నారు. కాషాయం పార్టీ అంటేనే ఒంటి కాలిపై లేచే అసదుద్దీన్.. ఇవాళ రాజాసింగ్‌పై అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇదే విషయమై MIM పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత ఖాజా బిలాల్. గోషామహల్‌లో తాను పోటీ చేస్తానంటే అసదుద్దీన్ వద్దన్నారని ఆయన ఆరోపించారు. టిక్కెట్ ఇవ్వనుందుకే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఖాజా బిలాల్ ఆరోపించారు. గోషామహల్ స్థానంలో ఎంఐఎం పోటీ చేయకపోవడం వెనుక కుట్ర ఉందన్నారు.

బీజేపీ, ఎంఐఎం పార్టీకి చీకటి ఒప్పందం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజాసింగ్‌పై అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసదుద్దీన్‌ ఓవైసీ ఉంది ముస్లింల కోసమా, బీజేపీ కోసమా అని మండిపడుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోషామహల్ అసెంబ్లీ పరిధిలో 80వేల వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి. అయినా కూడా అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని MIM నేతలే ప్ర‌శ్నిస్తున్న‌ పరిస్థితి.

First Published:  16 Nov 2023 11:07 AM GMT
Next Story