Telugu Global
Telangana

టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేసీఆర్. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను తిరిగి చూస్తారని కేడర్‌కు భరోసా ఇచ్చారు.

టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
X

బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థులు, సీనియర్ నేతలతో సమావేశమైన కేసీఆర్‌.. పార్టీ మారిన నేతలు మళ్లీ టచ్‌లోకి వచ్చారని చెప్పారు. రేవంత్ వ్యవహార శైలి నచ్చకే మళ్లీ టచ్‌లోకి వచ్చారని చెప్పుకొచ్చారు కేసీఆర్. ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తా అన్నాడని, కానీ తానే వద్దని చెప్పానన్నారు కేసీఆర్. పార్టీ మారిన వ్యక్తులను కాళ్లు మొక్కినా మళ్లీ తీసుకునేది లేదని స్పష్టంచేశారు.

రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోవడం లేదన్నారు కేసీఆర్. ఒకవేళ రేవంత్ బీజేపీలోకి వెళ్లినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోడీ కూల్చే ప్రయత్నం చేశారని.. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్న సీట్లను చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత తనతో చెప్పాడని స్పష్టంచేశారు కేసీఆర్‌. ఏడాది తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని జోస్యం చెప్పారు.

ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేసీఆర్. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను తిరిగి చూస్తారని కేడర్‌కు భరోసా ఇచ్చారు. కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదని.. ప్రజల్లో ఉండాలని స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తానన్నారు కేసీఆర్. బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇవాళ ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటల వరకు పంటల పరిశీలన, అనంతరం రోడ్‌ షోల్లో పాల్గొననున్నారు కేసీఆర్. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

First Published:  18 April 2024 2:18 PM GMT
Next Story