Telugu Global
Telangana

నేను కరీంనగర్‌లోనే పుట్టిన.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది : మంత్రి కేటీఆర్

నేను కరీంనగర్‌లోనే పుట్టి.. ఇక్కడే కొంత కాలం చదువుకున్నాను. అప్పటి నగరంలో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది.

నేను కరీంనగర్‌లోనే పుట్టిన.. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది : మంత్రి కేటీఆర్
X

కరీంనగర్‌కు ఇద్దరు ప్రజాభిమానం కలిగిన నాయకులు ఉన్నారు. క్షేత్ర స్థాయి నుంచి ఒకరు మంత్రిగా ఎదిగిన గంగుల కమలాకర్ అయితే.. మరొకరు కార్పొరేటర్ నుంచి మేయర్‌గా ఉన్న సునీల్‌రావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్, జిల్లా గ్రంథాలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనున్న డిజిటల్ లైబ్రరీ పనులకు మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..

నేను కరీంనగర్‌లోనే పుట్టి.. ఇక్కడే కొంత కాలం చదువుకున్నాను. అప్పటి నగరంలో పోలిస్తే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కరీంనగర్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది. ఇప్పుడు కరీంనగర్‌లో అంతర్గత రహదారులు, మంచి నీటి సరఫరా అద్బుతంగా మెరుగైంది. దేశంలో ఎక్కడా లేనట్లుగా కరీంనగర్‌లో కొన్ని ప్రాంతాలకు 24 గంటల మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించాము. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి కానున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కరీంనగర్‌లో ఇప్పుడు పారిశుథ్య సమస్య లేకుండా మంత్రి కమలాకర్, మేయర్ సునీల్ రావు చాలా కృషి చేశారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో తప్ప.. ముఖ్య నగరంలో ఇలాంటి సమస్య లేదు. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కేటీఆర్ చెప్పారు. దేశంలోని చాలా నగరాల్లో 10, 12 రోజులకు కూడా ప్రజలకు నీరు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కానీ, తెలంగాణలోని ఏ నగరంలో కూడా ఇలాంటి సమస్యలు లేవని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ప్రజలు ఎప్పుడైనా ప్రాథమిక వసతులనే కోరుకుంటారు. అలాంటప్పుడు మనం పారిశుథ్యం, నీళ్లు, స్ట్రీట్ లైట్లు, రోడ్లు బాగా ఉండేలా చూడాలి. రాష్ట్రంలో తొలి సారిగా మున్సిపల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కరీంనగర్‌లోనే.. స్వచ్ఛ ఆటోల విషయంలో కూడా జీపీఎస్ సిస్టమ్ అమలులో ఉన్నదని కేటీఆర్ చెప్పారు.

అధికారులను తిట్టడం అనేది ఈ మధ్య ఎక్కువగా ఉన్నది. కొంత మంది కార్పొరేటర్లు కావాలనే అధికారులను తిడుతున్నారు. దీని వల్ల ఆఫీసర్ల స్పూర్తి దెబ్బతింటోంది. అందుకే ఇకపై ప్రెస్‌కు ఒక బ్రీఫింగ్ ఇస్తే సరిపోతోంది. మీడియాను చూసి చాలా మంది రెచ్చిపోయి అధికారులను తిడుతున్నారు. దాన్ని కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.



First Published:  21 Jun 2023 3:26 PM GMT
Next Story