Telugu Global
Telangana

సమైక్య వాదుల కుట్ర, తెలంగాణ ప్రజలు జాగ్రత్త..

కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి లాంటి వాళ్లు తెలంగాణ పై దండయాత్ర మొదలు పెట్టారని, మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని, సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణను మళ్లీ పోనీయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

సమైక్య వాదుల కుట్ర, తెలంగాణ ప్రజలు జాగ్రత్త..
X

తెలంగాణపై మళ్లీ సమైక్యవాదుల కుట్ర మొదలైందని అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సమైక్య వాదులు మళ్లీ ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారని, దురాలోచనతో ఇక్కడకు వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వాదులు, ప్రజలు వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతేరాజు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యల్ని గుర్తు చేశారు గుత్తా. పార్లమెంట్ లో తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కేవీపీ, ఇప్పుడు తెలంగాణ వాడిని అనడంలో కుట్ర దాగి ఉందని చెప్పారు. ఓ పద్ధతి ప్రకారం కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోందని అన్నారు.

కేసీఆర్ పాలనకంటే రాజన్న పాలన గొప్పదా..?

తెలంగాణ వ్యతిరేకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల వ్యవహారం పెద్ద జోక్ గా మారిందని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటోందని, రాజన్న పాలనకంటే వందరెట్లు కేసీఆర్ పాలన బాగుందని చెప్పారాయన. తెలంగాణను దోచుకున్న వాళ్లే మళ్లీ ఇక్కడ పాగా వేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. షర్మిల కూడా అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు గుత్తా. ఏపీలో రాజకీయాలు చేతకాక, మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి షర్మిల ఇక్కడకు వస్తున్నారని, కాంగ్రెస్ తో కలసి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి లాంటి వాళ్లు తెలంగాణ పై దండయాత్ర మొదలు పెట్టారని, మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని, సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణను మళ్లీ పోనీయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

First Published:  4 Sep 2023 1:45 PM GMT
Next Story