Telugu Global
Telangana

తన్నుకున్న కాంగ్రెస్, BRS నేత‌లు.. కొడంగల్‌లో హైటెన్షన్

రాత్రి 9 గంటలకు రేవంత్ అనుచరుల దాడి నుంచి తప్పించుకున్నానని.. తిరిగి అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ తిరుపతిరెడ్డి దాడికి దిగారని ఫసియుద్దీన్ పోలీసులకు వివ‌రించారు.

తన్నుకున్న కాంగ్రెస్, BRS నేత‌లు.. కొడంగల్‌లో హైటెన్షన్
X

కొడంగల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, BRS నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తున్న బోరబండ కార్పొరేటర్‌ ఫసియుద్దీన్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసమ‌య్యాయి. రేవంత్ రెడ్డి సోద‌రుడు తిరుపతి రెడ్డి తమను వెంబడించి దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫసియుద్దీన్.

రాత్రి 9 గంటలకు రేవంత్ అనుచరుల దాడి నుంచి తప్పించుకున్నానని.. తిరిగి అర్ధరాత్రి ఒంటిగంటకు మళ్లీ తిరుపతిరెడ్డి దాడికి దిగారని ఫసియుద్దీన్ పోలీసులకు వివ‌రించారు. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత‌ల‌పై దాడి చేయిస్తున్నారన్నారు. తక్షణమే తిరుపతిరెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపైనా హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్త కూర నరేష్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ మేయర్, అతని అనుచరులు 20 మంది తనను కారులోకి లాగి రక్తం వచ్చేలా కొట్టారని ఫిర్యాదు చేశాడు నరేష్. దీంతో పట్నం నరేందర్‌రెడ్డి సహా 8మందిపై 307తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని A-1గా చేర్చారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

First Published:  26 Nov 2023 6:14 AM GMT
Next Story