Telugu Global
Telangana

తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు.. కట్టలే కట్టలు.!

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకూ మొత్తం రూ.538 కోట్ల 23 లక్షలకుపైగా విలువైన సొత్తును పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు.. కట్టలే కట్టలు.!
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటివరకూ దాదాపు రూ.500 కోట్లకుపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ దాదాపు రూ.5 కోట్ల 77 లక్షలు ఉంటుందన్నారు అధికారులు.

ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకూ మొత్తం రూ.538 కోట్ల 23 లక్షలకుపైగా విలువైన సొత్తును పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.184.89 కోట్ల నగదు, రూ.178.61 కోట్ల విలువైన బంగారం,వెండి, ఇతర అభరణాలు ఉన్నాయి.

వీటితో పాటు రూ.74.71 కోట్ల విలువైన మద్యం, రూ.31.64 కోట్ల విలువైన డ్రగ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. ఇక రూ.68 లక్షలకుపైగా విలువైన చీరలు, బియ్యం, మొబైల్స్‌, ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న గిఫ్టులను స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసే నాటికి పట్టుబడిన సొమ్ము విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నగదు, మద్యం పట్టుబడుతుండటంతో అధికారులు అవాక్కవుతున్నారు.

First Published:  11 Nov 2023 2:54 AM GMT
Next Story