Telugu Global
Telangana

తెలంగాణకు కొత్త గవర్నర్.. కారణం అదేనా..?

తెలంగాణలోనూ కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్‌ను ఎదుర్కునేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఢిల్లీ పెద్దలు.

తెలంగాణకు కొత్త గవర్నర్.. కారణం అదేనా..?
X

తెలంగాణకు త్వరలోనే కొత్త గవర్నర్ రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. తమిళిసై సౌందరరాజన్ స్థానంలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించబోతోందని సమాచారం. ప్రస్తుత గవర్నర్‌ తమిళిసై పుదుచ్చేరికి బదిలీ కాబోతున్నారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్‌‌‌‌ను నియమించాల్సి వస్తే పొలిటికల్‌‌ లీడర్‌‌‌‌కు ఛాన్స్ దక్కుతుందా.. లేక రిటైర్డ్ ఆఫీసర్‌‌‌‌కు అవకాశం వస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌ నరసింహన్‌‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించింది. 2014లో NDA అధికారంలోకి వచ్చినా ఆయన్నే కొనసాగించింది. తర్వాత NDA సెకండ్‌‌ టర్మ్‌‌లో తమిళిసైని నియమించింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

NDA హయాంలో రాజకీయాలకు సంబంధం లేని పలువురిని గవర్నర్లుగా నియమించింది. కేరళ, ఏపీలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను, కేంద్ర మంత్రులుగా ఉన్న వారిని గవర్నర్లుగా నియమించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకోబోతోందనే చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్‌ను ఎదుర్కునేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఢిల్లీ పెద్దలు. అటు లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు గవర్నర్ తమిళిసై. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ నడ్డాల అపాయింట్మెంట్‌ తీసుకున్నారు. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరనున్నట్లు సమాచారం. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌‌‌‌ను కేంద్రం నియమించే అవకాశం ఉంది. వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో జనవరి నుంచి విసృతంగా పర్యటించాలని తమిళిసై ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. 2019 సెప్టెంబర్‌‌‌‌లో రాష్ట్ర గవర్నర్‌‌‌‌గా తమిళిసై నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4 ఏండ్ల టర్మ్ పూర్తయింది.

First Published:  26 Dec 2023 8:52 AM GMT
Next Story