Telugu Global
Telangana

జైలుకు BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకంటే?

ఎయిర్‌పోర్టు నుంచి రహీల్‌ను పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. రహీల్‌కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

జైలుకు BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు.. ఎందుకంటే?
X

బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్‌ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌కు వచ్చిన రహీల్‌ను ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ దగ్గర బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం తర్వాత రహీల్‌కు బదులుగా మరికొరిని డ్రైవర్‌గా చేర్చి.. రహీల్ దుబాయ్‌కి పారిపోయాడు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దుబాయ్‌కి పరారు కావడంతో అతడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల లోక్‌ఔట్‌ నోటీసులను కోర్టు రద్దు చేయడంతో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు రహీల్. సమచారం అందుకున్న పోలీసులు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే రహీల్‌ను అరెస్ట్ చేశారు.

ఎయిర్‌పోర్టు నుంచి రహీల్‌ను పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. రహీల్‌కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఈ నెల 22 వరకు రహీల్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండనున్నాడు. పోలీసులు అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇదే కేసులో రహీల్ తండ్రి షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన అభియోగాలు మోపారు. ప్రజా భవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో రహీల్‌ను తప్పించేందుకు తన ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్లు చూపించారు నిందితులు. కానీ.. అసలు నిందితుడు రహీల్‌గా పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోనూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఇద్దరి మృతికి కారణమయ్యాడని షకీల్ కొడుకు రహీల్‌పై ఆరోపణలు వచ్చాయి.

First Published:  8 April 2024 5:02 AM GMT
Next Story