Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డి నిందలు.. బీజేపీ రియాక్షన్ ఏంటంటే..?

రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో మంచి హోదాని కల్పించిందని, అలాంటి పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు లక్ష్మణ్.

రాజగోపాల్ రెడ్డి నిందలు.. బీజేపీ రియాక్షన్ ఏంటంటే..?
X

తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవాలని బీజేపీ, కాంగ్రెస్ కోరుకుంటున్నాయి. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమంటే మేమంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ దశలో బీజేపీకి అంత సీన్ లేదని ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ ని ఓడించేంత సీన్ బీజేపీకి లేదని అన్నారాయన. కాంగ్రెస్ మాత్రమే ఆ పని చేస్తుందని, ఆ విషయాన్ని ప్రజలు నమ్మారని, ప్రజాభీష్టం మేరకే తాను పార్టీ మారుతున్నానని చెప్పారు. దీంతో బీజేపీకి సెగ తగిలింది. బీజేపీ నేతలు ఒక్కొక్కరే స్పందించడం మొదలుపెట్టారు. ముందుగా ఎంపీ లక్ష్మణ్, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు.

రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో మంచి హోదాని కల్పించిందని, అలాంటి పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు లక్ష్మణ్. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ.. 15 నెలల్లోనే కాకుండా పోయిందా అని ప్రశ్నించారు లక్ష్మణ్.

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం బ్రేకింగ్ న్యూసేమీ కాదని, అందరూ ఊహించిందేనని అన్నారు బీజేపీ నేత బూరనర్సయ్య గౌడ్. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, ఆత్మ కాంగ్రెస్ లోనే ఉండిపోయిందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఆల్టర్నేట్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని చెప్పారు బూర. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మునుగోడులో పోటీ చేస్తే.. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసే అవకాశముంది. దీంతో ముందుగా ఆయన స్పందించడం విశేషం.


First Published:  25 Oct 2023 9:05 AM GMT
Next Story