Telugu Global
Telangana

ఆ రోజును చీకటి దినంగా భావిస్తూ కార్యక్రమాలు నిర్వహించండి-బండి సంజయ్

ఈనెల 27న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఆ రోజును చీకటి దినంగా భావిస్తూ కార్యక్రమాలు నిర్వహించండి-బండి సంజయ్
X

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 1975 జూన్ 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించడాన్ని చీకటి రోజుగా భావిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ రోజుల్లో దేశంలో ప్రజాస్వామిక వాదులను, జాతీయ వాదులను, వాజ్‌పేయితో సహా ఇతర ప్రతిపక్ష నేతలను, లక్షలాది మందిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధాలకు గురిచేశారని తెలిపారు. జూన్ 25వ తేదీని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఎమర్జెన్సీ డేని చీకటి దినంగా భావిస్తూ నేటి తరానికి నాటి ఎమర్జెన్సీ డే ఆకృత్యాలను తెలియజేస్తూ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా బండి సంజయ్ కోరారు.

భారతీయ జనతా పార్టీ ఈనెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్న `మేరా పోలింగ్ బూత్ సబ్సే మజ్బుత్` కార్యక్రమంలో భాగంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా ఇన్‌చార్జ్‌ల‌తో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో సహా అందరూ మేరా పోలింగ్ బూత్ స‌బ్సే మ‌జ్బుత్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని సూచించారు.

ఈనెల 27న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలు వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మేరా పోలింగ్ బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమానికి ప్రముఖ్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స‌భ్యులుగా బద్దం మహిపాల్ రెడ్డి, నరేందర్, డా.మాలతి, యశ్పాల్ గౌడ్, క్రాంతి కుమార్ వ్యవహరిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు, జిల్లా ఇంచార్జ్‌లు హాజరయ్యారు.

First Published:  24 Jun 2023 12:09 PM GMT
Next Story