Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ కు ఏడుగురు భారత షట్లర్ల అర్హత!

పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పురుషుల, మహిళల విభాగాలలో ఏకంగా ఏడుగురు అర్హత సంపాదించారు.

పారిస్ ఒలింపిక్స్ కు ఏడుగురు భారత షట్లర్ల అర్హత!
X

పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పురుషుల, మహిళల విభాగాలలో ఏకంగా ఏడుగురు అర్హత సంపాదించారు.

2024 పారిస్ ఒలింపిక్స్ కు సమయం దగ్గర పడుతున్న కొద్ది వివిధ క్రీడల్లో అర్హత సాధించిన క్రీడాకారుల పేర్లు బయటకు వస్తున్నాయి. గత దశాబ్దకాలంగా ఒలింపిక్స్ లో భారత్ కు ఏదో ఒక పతకం అందిస్తూ వస్తున్న బ్యాడ్మింటన్ క్రీడలో పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి మొత్తం ఏడుగురు భారత షట్లర్లు అర్హత సంపాదించారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పీవీ సింధుతో సహా ఏడుగురు భారత ప్లేయర్లు పారిస్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నారు.

పురుషుల డబుల్స్ లో...

గత రెండేళ్ల కాలంగా ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సంచలన విజయాలతో టాప్ ర్యాంక్ ను సైతం కైవసం చేసుకొన్న భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ..తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 3వ స్థానంలో నిలవడం ద్వారా నేరుగా పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగారు.

డ్రా అనుకూలించడంతో పాటు..కొద్దిపాటి అదృష్టం కలసి వస్తే భారతజోడీ బంగారు పతకం సాధించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

పురుషుల సింగిల్స్ లో ఇద్దరికి అర్హత...

పురుషుల సింగిల్స్ లో ప్రపంచ మాజీనంబర్ వన్, భారత టాప్ ర్యాంకర్ హెఎస్. ప్రణయ్, యువఆటగాడు లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ప్రపంచ మొదటి 10 ర్యాంకర్లలో ఒకడిగా నిలవడం ద్వారా ప్రణయ్ నేరుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించగా..లక్ష్యసేన్ అర్హత పోటీలలో పాల్గొనడం ద్వారా బెర్త్ సంపాదించగలిగాడు.

పీవీ సింధుకు ఇవే ఆఖరి ఒలింపిక్స్....

మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు కెరియర్ లో పారిస్ ఒలింపిక్సే ఆఖరి ఒలింపిక్స్ కానున్నాయి. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం, 2021 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు ప్రపంచ మహిళల సింగిల్స్ టాప్ -10 ర్యాంకర్లలో ఒకరిగా నిలవడం ద్వారా పారిస్ క్రీడల బెర్త్ సంపాదించింది.

గత ఏడాది కాలంగా గాయాలు, పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సింధు ఆటలో సైతం వాడీవేడీ తగ్గిపోడంతో...ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగబోతోంది.

మహిళల డబుల్స్ లో భారత నంబర్ వన్ జోడీ అశ్వనీ పొన్నప్ప- తనీషా క్రాస్టో సైతం ఒలింపిక్స్ కు అర్హత సంపాదించడంలో సఫలమయ్యారు.

పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా బ్యాడ్మింటన్ అంశాలు జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి.

పారిస్ ఆతిథ్యంలో మూడోసారి..మూడువారాలపాటు సాగే ఈ ప్రపంచ క్రీడల పండుగలో భారత్ తో సహా 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు 36 రకాల క్రీడల్లో తలపడనున్నారు.

ఈ క్రీడలలో భారత్ 125 మందికి పైగా అథ్లెట్లతో 16 రకాల క్రీడాంశాలలో పోటీపడే అవకాశం ఉంది.

First Published:  30 April 2024 9:07 AM GMT
Next Story