Telugu Global
Science and Technology

సరికొత్త వైఫై సైబర్ స్కామ్! జాగ్రత్తలు ఇలా..

వైఫై రూటర్ ఐపీ అడ్రెస్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్‌‌కు కనెక్ట్ అయిన మొబైల్స్‌లోని డేటాను చోరీ చెయొచ్చు లేదా ఆయా మొబైల్స్‌లో బ్రౌజ్ చేస్తున్న ఇంటర్నెట్ వివరాలు, ఎంటర్ చేస్తున్న పాస్‌వర్డ్‌ల వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

సరికొత్త వైఫై సైబర్ స్కామ్! జాగ్రత్తలు ఇలా..
X

పర్సనల్ డేటాను దొంగిలించడం కోసం సైబర్ నేరగాళ్లు రకరకాల కొత్త విధానాలను వెతుకుతుంటారని మనకు తెలుసు. ఇందులో భాగంగానే సరికొత్త వైఫై స్కామ్‌కు తెరలేపారు. యూజర్లు కనెక్ట్ చేసుకునే వైఫై ద్వారా కూడా డేటాను చోరీ చేస్తున్నారు. అదెలాగంటే..

యూజర్ల మొబైల్ ఫోన్ యాక్సెస్ పొందడానికి రకరకాల అడ్డదారులు ఉంటాయి. అందులో ఒకటే వైఫై యాక్సెస్‌ను హ్యాక్ చేయడం. అంటే యూజర్లు కనెక్ట్ అయిన వైఫైకు తామూ కనెక్ట్ అయ్యి వైఫై కనెక్షన్‌ను హ్యాక్ చేయడం ద్వారా పర్సనల్ వివరాలు దొంగిలిస్తారు. ఇలాంటి స్కామ్ బారిన పడకుండా ఉండేందుకు ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

వైఫై రూటర్ ఐపీ అడ్రెస్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఆ రూటర్‌‌కు కనెక్ట్ అయిన మొబైల్స్‌లోని డేటాను చోరీ చెయొచ్చు లేదా ఆయా మొబైల్స్‌లో బ్రౌజ్ చేస్తున్న ఇంటర్నెట్ వివరాలు, ఎంటర్ చేస్తున్న పాస్‌వర్డ్‌ల వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దీన్నే వైఫై హ్యాకింగ్ అంటారు. మొబైల్ యూజర్లు ఇలాంటి హ్యాకింగ్ బారిన పడకూడదంటే.. వాడుతున్న వైఫై కనెక్షన్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలి.

ముందుగా మీ వైఫై రూటర్‌‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. ఇతరులెవరూ సులువుగా కనెక్ట్ అయ్యే అవకాశం లేకుండా ఎనిమిది అక్షరాలు, అంకెలు, సింబల్స్‌తో కూడిన పాస్ వర్డ్ పెట్టాలి. అలాగే ఇతరులు పాస్‌వర్డ్ అడిగినప్పుడు మీరే మొబైల్ తీసుకుని ఎంటర్ చేయాలి. వారు ఉపయోగించడం అయిపోయిన తర్వాత పాస్‌వర్డ్ మార్చేస్తే ఇంకా మంచిది.

వైఫై రూటర్​ ఇన్​స్టలేషన్ అప్పుడు ఉండే డీఫాల్ట్​ లాగిన్ వివరాలను కూడా మార్చుకోవాలి. దీనికోసం వైఫై ప్రొవైడర్ సాయం తీసుకోవచ్చు. అలాగే వైఫై రూటర్‌‌లోకి లాగిన్ అవ్వడం, అందులో సెట్టింగ్స్ మార్చడం వంటివి తెలుసుకుంటే ఇంకొంత ఉపయోగం ఉంటుంది. మీ వైఫై రూటర్‌‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఎంతమంది మీ వైఫైని వాడుతున్నారు? వారి డివైజ్ వివరాలు కనిపిస్తాయి. అనుమానాస్పదంగా ఉన్న డివైజ్‌లను రిమూవ్ లేదా బ్లాక్ చేయొచ్చు.

ఇకపోతే పబ్లిక్ ప్లేసుల్లో ఉచితంగా లభించే వైఫైలకు కనెక్ట్ అవ్వకపోవడమే మంచిది. బయటకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ కోసం కొంత డేటాను మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం. పబ్లిక్ వైఫై కనెక్షన్స్‌లో కొన్ని బగ్స్‌ను ఇన్‌స్టాల్ చేసి హ్యాకింగ్‌కు పాల్పడుతుంటారు సైబర్ నేరగాళ్లు. కాబట్టి వైఫై విషయంలో ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.

First Published:  18 April 2024 5:00 AM GMT
Next Story