Telugu Global
NEWS

3 నెలల ముందే సంక్రాంతి బెర్తులు ఫిక్స్

ఈసారి పండక్కి మాత్రం అగ్ర హీరోలు నటించిన సినిమాలు సందడి చేయనున్నాయి. మూడు నెలల ముందే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవి అనేది ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది.

3 నెలల ముందే సంక్రాంతి బెర్తులు ఫిక్స్
X

టాలీవుడ్‌కు అతిపెద్ద సీజన్ సంక్రాంతి. వరుస సెలవులు, పెద్ద పండుగ కావడంతో ఈ పండక్కి ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు విడుదలైనా కలెక్షన్లకు డోకా ఉండదు. అందుకే అగ్ర హీరోలు తాము నటించే సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. గత ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోలు నటించిన సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయలేదు. కరోనా కారణంగా భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణ ఆగిపోవడంతో పెద్ద హీరోలు నటించిన సినిమాలు విడుదల కాలేదు.

ఒక్క నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు సినిమా మాత్రమే పెద్ద హీరో సినిమా కాగా.. మిగిలినవన్నీ చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. అయితే ఈసారి పండక్కి మాత్రం అగ్ర హీరోలు నటించిన సినిమాలు సందడి చేయనున్నాయి. మూడు నెలల ముందే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవి అనేది ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది.

ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాగే తమిళ అగ్ర హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారసుడు సినిమా కూడా సంక్రాంతి పండక్కి రాబోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను కూడా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను కూడా పొంగల్‌కు విడుదల చేస్తామని పలుమార్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇదే నిర్మాతలు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

అయితే చిత్రీకరణలో ఆలస్యం జరగడంతో ఈ సినిమాను డిసెంబర్ నాటికి విడుదల చేయడం కష్టమని భావిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని బాలకృష్ణ నిర్మాతలను కోరినట్లు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి, బాలకృష్ణ నటించిన రెండు సినిమాలకు నిర్మాతలు ఒక్కరే కావడంతో పండక్కి వారిలో ఒక్క సినిమానే విడుదల చేసే అవకాశం ఉంది.

దీంతో చిరంజీవి - బాబీ సినిమా విడుదలను వాయిదా వేస్తారేమోనన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమానే సంక్రాంతి పండక్కు రావడం ఖాయం అవుతోంది. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ చాలావరకు పూర్తికాగా ఇవాళ డబ్బింగ్ పనులను దర్శకుడు బాబీ పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉండడం, చిరంజీవి సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం కావడంతో సంక్రాంతి పండుగకు చిరంజీవి సినిమా రావడం ఖాయం అయ్యింది. ముగ్గుల పండక్కి ముగ్గురు అగ్ర హీరోలు అయిన ప్రభాస్, విజయ్, చిరంజీవి నటించిన సినిమాలు విడుదల కానుండడంతో ఈసారి థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

కాగా రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా, పవన్ కళ్యాణ్ - క్రిష్ హరి హర వీరమల్లు, శివ నిర్వాణ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లలో రూపొందుతున్న సినిమాలను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ వాటి చిత్రీకరణలో జరిగిన జాప్యం వల్ల అవి పొంగల్ రేసు నుంచి తప్పుకున్నాయి.

First Published:  14 Oct 2022 11:06 AM GMT
Next Story