Telugu Global
National

ప్రియుడితో రాసలీలలు.. చెల్లెళ్లు చూడటంతో చంపేసింది

పసివయసులో ఉన్న ఇద్దరు కుమార్తెలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం, వారిని చంపింది తమ కూతురే కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రియుడితో రాసలీలలు.. చెల్లెళ్లు చూడటంతో చంపేసింది
X

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి అతని కలసి సన్నిహితంగా మెలిగింది. ఆ సమయంలో వారి రాసలీలలను ఆమె చిన్నారి చెల్లెళ్లు ఇద్దరూ చూశారు. దీంతో వారు తల్లిదండ్రులకు చెబుతారేమో.. ఈ విషయం ఎక్కడి బయటపడిపోతుందో.. అనే భయంతో అక్క తన సొంత చెల్లెళ్లిద్దరినీ చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బహదూర్పుర్‌ గ్రామానికి చెందిన అంజలి(20) తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఆమె అతడితో సన్నిహితంగా ఉండగా.. 6, 4 సంవత్సరాల వయసు కలిగిన ఆమె చెల్లెళ్లు చూశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అంజలి తన గుట్టు బయటపడిపోతుందని కంగారుపడింది. అప్పటికప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారిని చంపేయడమే దీనికి పరిష్కారమని భావించింది. అనుకున్నదే తడవుగా పదునైన ఆయుధంతో చెల్లెళ్లిద్దరినీ చంపేసింది. అంతేకాదు.. వారిని ఎవరో చంపేశారంటూ.. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత వారికి కట్టు కథ చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండటం గుర్తించిన పోలీసులు ఆమెను నిలదీశారు. దీంతో అసలు విషయం వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో అంజలికి మరికొందరు కూడా సహకరించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పసివయసులో ఉన్న ఇద్దరు కుమార్తెలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం, వారిని చంపింది తమ కూతురే కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First Published:  11 Oct 2023 6:59 AM GMT
Next Story