Telugu Global
National

సెల్ఫీ తీసుకుందామని పిలిచి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన భార్య

సెల్ఫీ తీసుకుందాం.. అంటూ భర్తను ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఓ తాడుతో చెట్టుకు కట్టేసింది.

సెల్ఫీ తీసుకుందామని పిలిచి.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన భార్య
X


ఒకప్పుడు రాజకీయ కారణాల వల్లో, ఫ్యాక్షన్ గొడవల వల్లో హత్యలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు అటువంటి హత్యలు తగ్గిపోగా వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలే పెరిగిపోయాయి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకొని భర్తలు భార్యలను చంపుతుండగా.. భార్యలు కూడా ఈ విషయంలో భర్తలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని భర్తను అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.

ఇప్పుడు బీహార్‌లో అటువంటి ఘటనే జరిగింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అడ్డుగా ఉన్న త‌న‌ భర్తను తొలగించుకునేందుకు చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. ఈ సంఘటన బీహార్‌లో సంచలనం సృష్టించింది.

ముజఫర్‌పూర్ జిల్లా వాసుదేవ్‌పూర్ సరాయ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో అక్ర‌మ‌ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. అతడిని అడ్డుతొల‌గించుకోవాల‌ని నిర్ణయించుకుంది. శనివారం రాత్రి సెల్ఫీ తీసుకుందాం.. అంటూ భర్తను ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఓ తాడుతో చెట్టుకు కట్టేసింది.

అతడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత కిరోసిన్ తీసుకొచ్చి భర్తపై చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి పొగరావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆ తర్వాత బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్టు చేశారు. కాగా మంటల్లో గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

First Published:  13 Jun 2023 7:05 AM GMT
Next Story