Telugu Global
National

5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య.. బంపర్ ఆఫర్‌లో కొనుక్కున్న ప్రియురాలు

ఈ డీల్‌కి ఒప్పుకున్న ప్రియురాలు నెల రోజులు గడుపు కోరింది. దీనికి కూడా ఆ భార్య అంగీకరించింది. దాంతో.. భర్త బదిలీ కార్యక్రమం పూర్తయ్యింది.

5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య.. బంపర్ ఆఫర్‌లో కొనుక్కున్న ప్రియురాలు
X

కోటి రూపాయల కోసం భర్తను అమ్మేసిన కథను మనం సినిమాగా చూశాం.. కానీ అలాంటి ఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోని ఈ అసాధారణ ఘటన కర్ణాటకలోని మండ్య సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. తనని మోసం చేసి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్తని ఆమెకే అమ్మేసింది ఓ భార్య.

గత కొంతకాలంగా తన భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటం గమనించిన భార్య అతనిపై నిఘా పెట్టింది. కాస్త సమయం తీసుకొని చివరికి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. సన్నిహితంగా ఉండగానే పట్టుకోవడంతో వారేమీ ఎదురు చెప్పలేకపోయారు. ఇద్దరిని పంచాయితీ పెద్దల ముందుకు తీసుకువెళ్ళింది. అయితే తమను పట్టుకున్నందుకు ఆ ప్రియురాలు భయపడలేదు సరికదా గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని షరతు పెట్టింది. దీంతో ఆ ఇల్లాలికి చిర్రెత్తుకొచ్చింది. కట్టుకున్న భార్యని వదిలి బయట తిరుగుళ్ళు తిరిగే భర్త తనకు అక్కర్లేదని.. ఆ రూ.5లక్షలు తనకే ఇచ్చి అతన్ని ద‌క్కించుకోవాల‌ని ప్రియురాలికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఈ డీల్‌కి ఒప్పుకున్న ప్రియురాలు నెల రోజులు గడుపు కోరింది. దీనికి కూడా ఆ భార్య అంగీకరించింది. దాంతో.. భర్త బదిలీ కార్యక్రమం పూర్తయ్యింది. మొత్తానికి పంచాయితీ పెట్టి ఏదో తీర్పు ఇవ్వాల్సిన పెద్దలు, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన గ్రామస్తులు ఈ ఇద్దరి రాజీ ఒప్పందం చూసి అవాక్కయ్యారు. వీరి కోరిక మేరకు ఒక ఒప్పంద పత్రాన్ని రాయించి పంచాయితీ పెద్దలు సంతకాలు చేశారు. అయితే ఊరి పెద్దల సమక్షంలో ఓ వ్య‌క్తిని విక్రయించడానికి, అతన్ని కొనుక్కోవడానికి ఇద్దరు మహిళలు ఒప్పందం చేసుకున్న విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, వాళ్ల పంచాయితీ గురించి అసలు తెలీదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

First Published:  21 Oct 2023 7:17 AM GMT
Next Story