Telugu Global
National

అమెరికాలో ఉన్నత విద్య.. వీసాల జారీలో భారత్‌కే ప్రాధాన్యం

అమెరికాలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు – డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు.

అమెరికాలో ఉన్నత విద్య.. వీసాల జారీలో భారత్‌కే ప్రాధాన్యం
X

అమెరికాలో ఉన్నత విద్య.. వీసాల జారీలో భారత్‌కే ప్రాధాన్యం

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసాల జారీలో భారత్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ వేసవి(జూన్, జూలై, ఆగస్టు)లో రికార్డు స్థాయిలో 90 వేలకు పైగా వీసాలను జారీ చేసినట్టు తెలిపింది.

అమెరికాలో చదువు కోసం ప్రపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్లోనే ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించింది. ’ఉన్నత విద్య క‌ల‌ను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్ వర్క్, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం’ అని ఎక్స్‌(ట్విటర్‌ వేదికగా తెలిపింది.

అమెరికాలోని విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిస్తాయి. ఆగస్టు – డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఏటా వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువ మంది ఉంటున్నారు.

గతేడాది మొత్తంగా 1.25 లక్షల మందికి అమెరికా విద్యార్థి వీసాలు జారీ చేయగా.. వేసవిలో 82 వేల మందికి వీసాలను అందించింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదని.. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఒకే సీజన్‌లో 90 వేల వీసాలను జారీ చేసినట్టు ప్రకటించింది.

First Published:  25 Sep 2023 12:56 PM GMT
Next Story