Telugu Global
National

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన హింస‌ - కాల్పుల్లో ముగ్గురి మృతి

ఈ ఘ‌ట‌నను గ‌మ‌నించిన‌ వెంట‌నే కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్ పోస్టుకు వెళ్లి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు.

మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన హింస‌  - కాల్పుల్లో ముగ్గురి మృతి
X

దాదాపు రెండు వారాల త‌ర్వాత మ‌ణిపూర్‌లో మ‌ళ్లీ హింస చెల‌రేగింది. మారుమూల గ్రామానికి కాప‌లాగా ఉన్న ముగ్గురిని ఆయుధాల‌తో వ‌చ్చిన కొంద‌రు దుండ‌గులు కాల్చి చంపారు. శుక్రవారం వేకువజామున 4.30 గంట‌ల‌ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఉబ్రూల్ ఎస్సీ నింగ్డమ్ వషుమ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుంగ్‌ఖుల్ నాగా జ‌నాభా అధికంగా ఉండే ఉఖ్రూల్ రీజియ‌న్‌లోని తోవాయి కుకీ అనే గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌నను గ‌మ‌నించిన‌ వెంట‌నే కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్ పోస్టుకు వెళ్లి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

మణిపూర్‌లో కొనసాగుతున్న గిరిజన, గిరిజనేతర వర్గపోరులో భాగంగానే ఈ కాల్పులు జరిగాయని ఎస్సీ ధృవీకరించారు. మారుమూల గ్రామంలో ఈ కాల్పులు జ‌రిగాయ‌ని, భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేకపోయామని ఎస్సీ వెల్లడించారు. మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో గత రెండు నెలలుగా గ్రామస్తులే తమ యువతను కాపలాగా ఉంచుతూ వస్తున్నారు. ఈ ఘటన ప్రభావం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా భద్రతా బలగాలు మోహరించాయి.

First Published:  18 Aug 2023 10:22 AM GMT
Next Story