Telugu Global
National

సుప్రీం కోర్టు న్యాయవాది హత్య.. హంతకుడు ఎవరంటే?

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటలపాటు స్టోర్ రూమ్‌లోనే దాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు న్యాయవాది హత్య.. హంతకుడు ఎవరంటే?
X

ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. 61 ఏళ్ల మహిళా లాయర్ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా, భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివసిస్తున్నారు. కుమారుడు విదేశాల్లో ఉండగా వీరిద్దరే అక్కడ కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అయితే గత రెండు రోజులుగా రేణుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్య‌క్తం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు. అతడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.. దీంతో పోలీసులు నితిన్ ఫోన్ నెంబర్ ట్రాక్ చేసారు. అయితే అది మళ్ళీ వారి బంగ్లా వద్దనే చూపించింది. దీంతో పోలీసులు మరోసారి బంగ్లా మొత్తం వెతకగా స్టోర్ రూమ్‌లో కనిపించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటలపాటు స్టోర్ రూమ్‌లోనే దాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారితీనట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. నితిన్ తాము నివాసం ఉంటోన్న బంగ్లాను విక్రయించాలని భావించారు. అందులో భాగంగా కొనుగోలుదారు నుంచి కొంత నగదును కూడా తీసుకున్నారు. అయితే బంగ్లాను అమ్మడం రేణు సిన్హాకు ఇష్టం లేదు. ఈ వ్యవహారమే దంపతుల మధ్య వివాదానికి దారితీసింది. అందువల్లనే నిందితుడు భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.


First Published:  11 Sep 2023 10:31 AM GMT
Next Story