Telugu Global
National

పార్లమెంట్ లో అవిశ్వాసం..! విపక్ష కూటమికి లాభమేంటి..?

మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైంది, 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించడానికి విపక్ష కూటమి సన్నాహాలు చేస్తోంది.

పార్లమెంట్ లో అవిశ్వాసం..! విపక్ష కూటమికి లాభమేంటి..?
X

మణిపూర్ వ్యవహారంలో విపక్ష కూటమి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈరోజు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏకు 330మంది సభ్యుల మద్దతు ఉంది. ఎలా చూసినా అవిశ్వాసం వృథా ప్రయాసే అనుకోవాలి. కానీ మోదీ నోరు తెరవాలంటే అదే మార్గం అంటున్నారు విపక్ష నేతలు. మణిపూర్ వ్యవహారంలో మోదీ మౌనాన్ని బద్దలు కొట్టేందుకు అవిశ్వాసం సరైన అస్త్రం అని తీర్మానించారు.

మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైంది, 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించడానికి విపక్ష కూటమి సన్నాహాలు చేస్తోంది. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరుకావాలని ఎంపీలకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది.

అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో కచ్చితంగా ప్రధాని మోదీ మాట్లాడాల్సి ఉంటుంది. ప్రధాని మాట్లాడటంతోపాటు విపక్షాలకు కూడా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. చర్చలో విపక్షాల నోరు నొక్కే అవకాశం ఎవరికీ ఉండదు. అందుకే వ్యూహాత్మకంగా అవిశ్వాసానికి మొగ్గుచూపారు. మణిపూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నా.. కేంద్రం తప్పించుకుంటోంది. నెపం విపక్షాలపైకి నెట్టేసి ప్రధాని సైలెంట్ గా ఉంటున్నారు. ప్రకటన చేయడానికి ససేమిరా అంటున్నారు. అమిత్ షా.. విపక్షాలకు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు, చర్చకు సహకరించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మోదీ ప్రకటన విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో.. విపక్షాలు అవిశ్వాసానికి మొగ్గు చూపాయి.

అప్పుడే సెటైర్లు..

అవిశ్వాస తీర్మానం వృథా ప్రయాసని, 2018లోనే అది వీగిపోయిందని అంటున్నారు బీజేపీ నేతలు. అప్పటితో పోల్చి చూస్తే ఇప్పుడు తమ బలం మరింత పెరిగిందని అన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి. అవిశ్వాస తీర్మానం పెడితే.. ప్రభుత్వానికి 350 మందికిపైగా సభ్యుల మద్దతు లభిస్తుందని చెప్పారాయన.

First Published:  26 July 2023 1:32 AM GMT
Next Story