Telugu Global
National

కడుపులో బిడ్డకు డెంగ్యూ.. కోల్‌కతాలో అరుదైన కేసు

నిజానికి ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదు. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు ద్వారా బిడ్డకు వైరస్‌ లేదా ఇన్‌ఫెక్షన్‌ సోకడం.

కడుపులో బిడ్డకు డెంగ్యూ.. కోల్‌కతాలో అరుదైన కేసు
X

ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి డెంగ్యూ రావడంతో అప్పుడే పుట్టిన బిడ్డ కు కూడా NS1 పాజిటివ్‌ వచ్చిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. నిజానికి ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదు. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు ద్వారా బిడ్డకు వైరస్‌ లేదా ఇన్‌ఫెక్షన్‌ సోకడం. ఇది దోమలలో సర్వ సాధారణం కానీ మనుషుల్లో అసాధారణమైనదని డాక్టర్లు చెబుతున్నారు.

కోల్‌కతాలోని లేక్ టౌన్‌లో ఉంటున్న ఓ యువతి గర్భవతిగా ఉండగా సోకింది. ప్లేట్ లెట్ల సంఖ్య 40,000లకు పడిపోయింది. దీంతో ఆమె చార్నాక్ హాస్పిటల్‌లో చేరింది. ఆసుపత్రితో చేరిన నాలుగో రోజున అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఆమెకు సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేశారు. అయితే మరోసారి ఆమెకు పలు రకాల పరీక్షలు చేయించారు. డెంగ్యూ పాజిటివ్ రావడంతో అనుమానంతో వైద్యులు బిడ్డకు కూడా పరీక్షలు చేయించారు. దాంట్లో బిడ్డకు కూడా తల్లి నుంచి డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే పెద్దల మాదిరిగా కాకుండా, నవజాత శిశువులు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉండటంతో బిడ్డకు కొద్ది రోజుల పాటు ఐవీ థెరపీ చేశారు. దీంతో శిశువు కోలుకుంది. ప్రస్తుతానికి తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వారిని డిశార్జ్ కూడా చేసినట్లు వెల్లడించారు. అతి అరుదైన సందర్భాలలో మాత్రమే తల్లి ప్లాసెంటా నుంచి కడుపులోని పిండానికి ప్రసవానికి ముందు గానీ, ప్రసవ సమయంలో కానీ, ప్రసవమైన వెంటనే కానీ డెంగ్యూ సోకే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ కేసులో తల్లి మావి లేదా మాయ ద్వారా బిడ్డకు వైరస్ సోకి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.


First Published:  21 Sep 2023 11:35 AM GMT
Next Story