Telugu Global
National

డాక్ట‌ర్ల‌పై హింస‌ను అరిక‌ట్టేందుకు కొత్త నియ‌మావ‌ళి

నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (NMCRMP) నియమావళి పేరుతో రూపొందించిన నిబంధనలను తాజాగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

డాక్ట‌ర్ల‌పై హింస‌ను అరిక‌ట్టేందుకు కొత్త నియ‌మావ‌ళి
X

వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు ఇకపై చికిత్స నిరాకరించే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధ‌న‌లు రూపొందించింది. ఇటీవ‌ల కాలంలో రోగులు, వారి బంధువులు డాక్ట‌ర్ల‌పై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (NMCRMP) నియమావళి పేరుతో రూపొందించిన నిబంధనలను తాజాగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు వివ‌రించింది.

ఇకపై కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఎన్ఎంసీఆర్ఎంపీ రెగ్యులేషన్ 2023 అమల్లోకి రానుంది. రోగికి అందించే వైద్యం, ఫీజుకు సంబంధించిన వివరాలను తెలియజేసే బాధ్యత వైద్యులదే. చికిత్స ప్రారంభించే ముందే రోగికి కన్సల్టేషన్/చికిత్స ఫీజు గురించి తప్పక తెలియజేయాలని ఎన్ఎంసీఆర్ఎంపీ నిబంధనల్లో పేర్కొంది. ముందుగా చెప్పిన ప్రకారం ఫీజు చెల్లించకుంటే వైద్యుడు చికిత్స నిరాక‌రించ‌వచ్చ‌ని తెలిపింది. అత్య‌వ‌స‌ర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలిపింది.

రోగి లేదా వారి బంధువులు దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే.. వారి ప్రవర్తన గురించి రికార్డులో రాసి.. వేరేచోట తదుపరి చికిత్స చేయించుకునేలా వైద్యులు వారికి సూచించాలని ఎన్ఎంసీ నిబంధ‌న‌ల్లో తెలిపింది. ప్రాణాపాయ పరిస్థితులు మినహా వైద్యులు ఎవరికి చికిత్స అందించాలనేది పూర్తిగా వారి స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

రోగికి వైద్యం ప్రారంభించిన తర్వాత, వారి బంధువులకు సమాచారం అందించకుండా వైద్యుడు రోగికి చికిత్స నిరాకరించకూడదని కూడా నిబంధ‌న‌ల్లో పేర్కొంది. ఒకవేళ ప్రస్తుతం చికిత్స చేస్తున్న డాక్ట‌ర్‌తో పాటు అదనంగా మ‌రో డాక్ట‌ర్ అవ‌స‌రం ఉంటే రోగికి లేదా అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించాల‌ని తెలిపింది. అంతేకాదు.. డాక్ట‌ర్లు ఫార్మా సంస్థ‌ల నుంచి ఎలాంటి బ‌హుమ‌తులూ పొంద‌రాద‌ని స్ప‌ష్టం చేసింది. ఫార్మా సంస్థ‌లు విద్యా సంస్థ‌ల్లో నిర్వ‌హించే వ‌ర్క్‌షాప్‌లు, సెమినార్ల‌లో డాక్ట‌ర్లు పాల్గొన‌రాద‌ని నిబంధ‌న‌ల్లో తెలిపింది.

First Published:  11 Aug 2023 10:16 AM GMT
Next Story