Telugu Global
National

గిన్నిస్ బుక్ లో మహారాష్ట్ర మెట్రో.. బీజేపీ భలే కవరింగ్

ఇటీవల మహారాష్ట్ర నుంచి రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుజరాత్ తరలించింది కేంద్రం. మహారాష్ట్ర సీఎం షిండేని గుప్పెట్లో ఉంచుకున్న కేంద్రం, గుజరాత్ ఎన్నికల వేళ ప్రాజెక్ట్ ల తరలింపుతో ఆ రాష్ట్రానికి మేలు చేకూర్చాలని చూసింది.

గిన్నిస్ బుక్ లో మహారాష్ట్ర మెట్రో.. బీజేపీ భలే కవరింగ్
X

మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో మెట్రో రైల్ వ్యవస్థ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ప్రపంచంలో అతి పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రోగా ఇది రికార్డ్ సృష్టించింది. 3.14 కిలోమీటర్ల పొడవున కింద రోడ్డు, మధ్యలో హైవే, పైన మెట్రో మార్గం.. ఇలా ఉంటుంది ఈ నిర్మాణం. అందుకే ఇది రికార్డులకెక్కింది. సంతోషమే, కానీ ఇక్కడ బీజేపీ హంగామా మామూలుగా లేదు. నాగ్ పూర్ మెట్రోకి ఈ ఘనత దక్కినందుకు కేంద్రం శుభాకాంక్షలు చెప్పడంతోపాటు, ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కూడా.

ఎందుకీ హడావిడి..?

నాగ్ పూర్ మెట్రో గిన్నిస్ బుక్ లోకి ఎక్కినందుకు సంతోషపడాలి కానీ, మరీ కేంద్రం చంకలు గుద్దుకోవడం, మహారాష్ట్ర ఘనతను ఓ రేంజ్ లో ప్రచారం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మహారాష్ట్ర నుంచి రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గుజరాత్ తరలించింది కేంద్రం. మహారాష్ట్ర సీఎం షిండేని గుప్పెట్లో ఉంచుకున్న కేంద్రం, గుజరాత్ ఎన్నికల వేళ ప్రాజెక్ట్ ల తరలింపుతో ఆ రాష్ట్రానికి మేలు చేకూర్చాలని చూసింది, పరోక్షంగా మహారాష్ట్రను బీజేపీ వెనక్కు నెట్టేస్తోందనే విమర్శలను మూటగట్టుకుంది. దీన్ని కవర్ చేసుకోడానికే ఇప్పుడు మహారాష్ట్రకి ఎక్కడలేని హైప్ క్రియేట్ చేస్తోంది.

ఎందుకీ సవతి తల్లి ప్రేమ..

నాగ్ పూర్ మెట్రో రైల్ ఘనత సాధించింది సరే, హైదరాబాద్ మెట్రో సంగతేంటి. ఇతర రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణాలకు కేంద్రం నిధులు సమకూరుస్తున్నా, హైదరాబాద్ ని మాత్రం పూర్తిగా పక్కనపెట్టింది. కనీసం రెండో దశకైనా నిధులివ్వాలని రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు వెళ్లినా కేంద్రం సమాధానం చెప్పలేదు. ఇప్పుడిలా పుండుమీద కారం చల్లినట్టు మహారాష్ట్ర మెట్రోకి గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కిందంటూ డప్పు కొట్టుకుంటోంది. గుజరాత్ కోసం మహారాష్ట్ర ప్రాజెక్ట్ లను పణంగా పెట్టి, ఇప్పుడిలా గిన్నిస్ రికార్డ్ అంటూ జోలపాడుతోంది.

First Published:  7 Dec 2022 3:16 AM GMT
Next Story