Telugu Global
National

కొడుకు ప్రేమ పెళ్లి.. గుడికని తీసుకెళ్లి కోడలిని చంపిన అత్త

ఈ నేపథ్యంలో ఇటీవల నితీష్ తల్లిదండ్రులు కొడుకు, కోడలిని ఇంటికి ఆహ్వానించారు. కొడుకు ముందర పూజను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రెండు వారాల కిందట అత్త కోడల్ని గుడికి అని వెంట తీసుకెళ్లింది.

కొడుకు ప్రేమ పెళ్లి.. గుడికని తీసుకెళ్లి కోడలిని చంపిన అత్త
X

మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ సినిమా చూశారా..? అందులో హీరో అక్క ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. అది వాళ్ళ అత్తమామ‌ల‌కు ఇష్టం ఉండదు. కొడుకు ముందర ఇష్టం ఉన్నట్లు నటించి కోడల్ని చంపేందుకు అత్తామామలు స్కెచ్ లు వేస్తుంటారు. ఈ ప్రయత్నంలో పలుమార్లు విఫలం అవుతారు. చివరికి హీరో అత్త మామల నుంచి తన అక్కను కాపాడుకుంటాడు. అయితే నిజ జీవితంలో ఇటువంటి ఘటనే జరిగింది. అయితే ఇందులో కోడలు హత్యకు గురైంది.

బీహార్ రాష్ట్రం ఛప్రా సమీపంలోని చందా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ నాలుగేళ్ల కిందట పూజకుమారి అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి యువకుడి కుటుంబంలో ఇష్టం లేదు. పెళ్లి అయిన తర్వాత నితీష్ వేరే ప్రాంతానికి వెళ్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. పూజ కారణంగా కుమారుడు దూరం కావడంతో ఆమెపై అత్త కక్ష పెంచుకుంది. ఎలాగైనా కోడలిని చంపాలని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల నితీష్ తల్లిదండ్రులు కొడుకు, కోడలిని ఇంటికి ఆహ్వానించారు. కొడుకు ముందర పూజను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. రెండు వారాల కిందట అత్త కోడల్ని గుడికి అని వెంట తీసుకెళ్లింది. ధనుక అనే గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ కోడల్ని హత్య చేసింది. మృతదేహాన్ని చన్వార్ లోని కాలువలో పడేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చింది.

భార్య అదృశ్యం కావడంతో నితీష్ కుమార్ పలుచోట్ల వెతికాడు. అయినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చన్వార్ కాలువలో కుళ్ళిన స్థితిలో పూజ మృతదేహం కనిపించింది. నితీష్ తల్లిపై అనుమానం రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీక‌రించింది.

First Published:  11 April 2023 12:43 PM GMT
Next Story