Telugu Global
National

భర్త ప్రాణం తీసిన సీరియల్ పిచ్చి

ఆశీర్వాదం సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. భార్యను ఛానల్ మార్చమని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.

భర్త ప్రాణం తీసిన సీరియల్ పిచ్చి
X

కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్‌కు ఉన్న క్రేజ్ కొంచం కూడా తగ్గడం లేదు. పని లేనప్పుడు టీవీ చూడటం కాదు, పని మానుకొని సీరియల్ చూడటం చాలామంది మహిళలకు అలవాటైంది. ఈ పిచ్చి కుటుంబాలలో చిచ్చుపెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. అంతేకాదు, సీరియల్‌లో లీనమై మహిళలు ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా, భార్య సీరియల్ పిచ్చికి భర్త ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

ఆశీర్వాదం, నిషా దంప‌తులు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో నివ‌సిస్తున్నారు. నిషాకు టీవీ సిరియల్స్ అంటే చాలా ఇష్టమని భ‌ర్త ఆశీర్వాదంకు తెలుసు. ఎప్పటిలాగే ఆశీర్వాదం సాయంత్రం ఇంటికొచ్చేసరికి భార్య తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. భార్యను ఛానల్ మార్చమని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆశీర్వాదం ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. ఆశీర్వాదానికి చిర్రెత్తుకొచ్చి.. ఛానల్ మార్చాల్సిందేనని పట్టుపట్టాడు. అందుకు ఆమె ససేమిరా అంది. చివరకు ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారింది.

ఆశీర్వాదం భార్యపై తీవ్రంగా అరిచాడు. అలా ఇద్దరు మధ్యా మాటలు పెరిగాయి. విసిగొచ్చిన ఆశీర్వాదం బయటకు వెళ్లిపోయాడు. చిరాకొచ్చిన నిషా అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. బయటకు వెళ్ళి వచ్చిన ఆశీర్వాదం ఇంటికొచ్చి చూసేసరికి భార్య లేకపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. మ‌రుస‌టి రోజు ఉదయం భార్యకు కోపం తగ్గి తిరిగి ఇంటికి వచ్చింది. కానీ, అప్పటికే భర్త ఆశీర్వాదం ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. కన్నీరు మున్నీరుగా విలపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

First Published:  17 Oct 2023 7:13 AM GMT
Next Story