Telugu Global
National

ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి : సీజేఐ డీవై చంద్రచూడ్

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు రిపోర్టింగ్‌లో కచ్చితంగా, నిష్పాక్షికత, బాధ్యతాయుతంగా, భయం లేకుండా ఉండటం ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు.

ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి : సీజేఐ డీవై చంద్రచూడ్
X

ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్య ఉద్రిక్తలు, ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తాయని.. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాదకరమని, వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 16వ రామ్‌నాథ్ గోయెంకా అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం దేశ ప్రజాస్వామ్యాన్ని మెరుగైన దిశగా నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోందని.. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు రిపోర్టింగ్‌లో కచ్చితంగా, నిష్పాక్షికత, బాధ్యతాయుతంగా, భయం లేకుండా ఉండటం ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు. మన దేశం ప్రజాస్వామ్యాయుతంగా వర్ధిల్లాలి అంటే మీడియా స్వేచ్ఛ ముఖ్యమని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కత్తి కంటే కలం గొప్పదని యావత్ లోకం విశ్వసిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నో సందర్భాల్లో సామాజిక, రాజకీయ మార్పు కోసం కీలక పాత్ర పోషించిన చరిత్ర వార్తా పత్రికలకు ఉందని ఆయన అన్నారు.

మీడియాలో వచ్చే వార్తల్లో వాస్తవాలను పరిశీలించే సమగ్రమైన వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క నకిలీ వార్త తీవ్రమైన విధ్వంసానికి దారి తీసే ప్రమాదం ఉందని చెప్పారు. మీడియా కూడా తమ సొంత ట్రయల్స్‌ను మానుకోవడం మంచిదని హితవు పలికారు. కోర్టులు విచారణ పూర్తి చేయకుండానే మీడియా ఒక నిందితుడిని ప్రజల ముందు దోషిగా చూపిన సందర్భాలు ఉన్నాయన్నారు. అమాయకుల హక్కులను ఉల్లంఘించకుండా ప్రజలకు బాధ్యతాయుతమైన సమాచారాన్ని అందించాలని సీజేఐ కోరారు.

ఒక్కోసారి నిశ్శబ్దం ఎంత శక్తివంతమైందో కూడా పత్రికలు నిరూపించాయని చెప్పారు. ఇందిరా గాంధీ హత్య జరిగన సమయంలో ఎమర్జెన్సీని విధించారు. ఆ సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తమ ఎడిట్ పేజీలను ఖాళీగా వదిలేసింది. నిశ్శబ్దం ఎంత శక్తివంతమైందో చూపించడానికి అదే నిదర్శనమని ఆయన అన్నారు. అదొక భయంకరమైన సమయం.. ఆ సమయం నిజమైన జర్నలిజానికి దారి తీసిందని చంద్రచూడ్ అన్నారు. నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

First Published:  23 March 2023 3:45 AM GMT
Next Story