Telugu Global
National

కర్నాటక ఎన్నికల వేళ‌ ముదిరిన పాల లొల్లి... నందిని, అముల్....మధ్యలో హెరిటేజ్

తమిళనాడుకు చెందిన ఆరోగ్య పాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హెరిటేజ్, దోడ్లా, తిరుమల పాలు, పాల ఉత్పత్తులు చాలా సంవత్సరాల నుంచి బెంగళూరు నగరంతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారని, ఇంతకాలం వాటిని అడ్డుకోని కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ నాయకులు ఇప్పుడు గుజరాత్ కు చెందిన అముల్ కర్ణాటకలోకి వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని తేజస్వి సూర్య మండి పడ్డారు.

కర్నాటక ఎన్నికల వేళ‌ ముదిరిన పాల లొల్లి... నందిని, అముల్....మధ్యలో హెరిటేజ్
X

కర్నాటక మార్కెట్ లోకి గుజరాత్ కు చె‍దిన అముల్ పాలను, పాల ఉత్పత్తులను తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయంపై అక్కడ తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంపై, పాల రైతులు, ప్రతిపక్షాలు విరుచుకపడుతున్నాయి. కర్నాటకలోని నందిని పాలను నాశనం చేయడానికే బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరో వైపు అముల్ కు వ్యతిరేకంగా రైతులకు అండగా రెస్టారెంట్లు, హోటళ్ళ యజమాన్యాలు కూడా నిరసనలు తెలుపుతున్నాయి.

మరో వైపు అముల్ ను ఎలాగైనా తీసుకొచ్చి తీరాలన్న పట్టుదలతో బీజేపీ ప్రభుత్వం, నాయకులున్నారు. ఈనిరసనలు కాంగ్రెస్, జేడీఎస్ ల కుట్ర అని బీజేపీ ఆరోపిస్తోంది. ఇతర రాష్ట్రాల పాల కంపెనీలకు లేని అడ్డంకి ఒక్క గుజరాత్ పాల కంపెనీకే ఎందుకని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన ఆరోగ్య పాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హెరిటేజ్, దోడ్లా, తిరుమల పాలు, పాల ఉత్పత్తులు చాలా సంవత్సరాల నుంచి బెంగళూరు నగరంతో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారని, ఇంతకాలం వాటిని అడ్డుకోని కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ నాయకులు ఇప్పుడు గుజరాత్ కు చెందిన అముల్ కర్ణాటకలోకి వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని తేజస్వి సూర్య మండి పడ్డారు.ఇది కచ్చితంగా పొలిటికల్ గిమ్మిక్కు అని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చి నేడు భారతదేశంలో నెంబర్ నాయకులు అయ్యారని, అదే గుజరాత్ కు చెందిన అమూల్ సంస్థను అడ్డం పెట్టుకుని ఆ ఇద్దరు నాయకుల మీద విమర్శలు చేసి రాజకీయంగా లబ్దిపొందడానికి కాంగ్రెస్ , జేడీఎస్ నాయకులు కంకణం కట్టుకున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు.

కాగా కొంత కాలంగా 'సేవ్ నందిని, గో బ్యాక్ అమూల్' పేరుతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి అనేక వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నది. రైతులు, కన్నడ సంస్థలు, అనేక వర్గాల ప్రజలు 'సేవ్ నందిని, గో బ్యాక్ అమూల్' నినాదానికి మద్దతు తెలుపుతున్నారు. ప్రజల నుండి వస్తున్న మద్దతును చూసే , ఈ వివాదాన్ని పక్కదోవపట్టించడానికి బీజేపీనాయకులు, ఏపీ, తమిళనాడు పాల వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

First Published:  11 April 2023 1:36 AM GMT
Next Story