Telugu Global
National

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం
X

ఢిల్లీలో గురువారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలతో 11 మంది సజీవదహనం అయినట్లు పోలీసులు తెలిపారు. కాస్త వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్న గోడౌన్లకు విస్తరించడంతో విషయం అర్ధం అయ్యేలోగా ఘొరం జరిగిపోయింది. మొత్తం 22 ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఓ కానిస్టేబుల్ సహా మరో నలుగురికి గాయాలయ్యాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీపూర్‌లోని దయాల్ పూర్ మార్కెట్ ఏరియాలో ఉన్న ఓ పెయింట్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న రెండు గోడౌన్లు, డీ అడిక్షన్ సెంటర్లకు వ్యాపించాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెట్ల మార్గం నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న కార్మికులు తప్పించుకోలేక పోయినట్లు స్థానిక అధికారి తెలిపారు. గురువారం రాత్రి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించగా.. శుక్రవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. మంటల్లో కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.


అయితే, అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో నిల్వ చేసిన వివిధ రసాయనాల వల్ల పేలుడు జరిగి మంటలు ఎగిసిపడి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, కనిపించకుండా పోయిన వారిని వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

First Published:  16 Feb 2024 8:34 AM GMT
Next Story