Telugu Global
National

ప్రేయసిని 35 ముక్కలు చేసిన రాక్షసుడు

ముంబైకి చెందిన అఫ్తాబ్ తన ప్రేయసితో కలిసి ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో మే 18న ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవ తలెత్తింది. ఈ ఘర్షణలో శ్రద్ధను అఫ్తాబ్ హతమార్చాడు.

ప్రేయసిని 35 ముక్కలు చేసిన రాక్షసుడు
X

క్రైం థ్రిల్లర్‌ను తలపించిన ఓ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఓ దుర్మార్గుడు దారుణానికి తెగబడ్డాడు. ప్రేయసిని చంపేసి.. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో దాచాడు. అంతేకాక ఆ ముక్కలను ప్రతి రోజు ఒక దగ్గరకి చేర్చి రాక్షసానందం పొందేవాడు. తర్వాత ఆ మృతదేహం విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. ముంబైకి చెందిన అఫ్తాబ్ తన ప్రేయసితో కలిసి ఢిల్లీలోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో మే 18న ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవ తలెత్తింది. ఈ ఘర్షణలో శ్రద్ధను అఫ్తాబ్ హతమార్చాడు.

నేరాన్ని దాచిపెట్టేందుకు ఆమె శరీరాన్ని ఏకంగా 35 ముక్కలు చేశాడు. వీటిని ఉంచేందుకు 300 లీటర్ల ఫ్రిడ్జి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వరుసగా 18 రోజుల పాటు ప్రతిరోజు అర్ధ‌రాత్రి రాజధానిలోని మెహ్రౌలీ ఫారెస్టులో శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. కొన్ని రోజులుగా శ్రద్ధ ఫోన్ కలవకపోవడంతో ఆమె తండ్రి ఢిల్లీ వెళ్లాడు. శ్రద్ధ ఫ్లాట్‌కు తాళం వేసి ఉండడం, కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో శ్రద్ధను చంపినట్లు అఫ్తాబ్‌ నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. కాగా, వీరిద్దరికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరు ముంబై నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. దీనిని హృదయవిదారక ఘటనగా పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జీవిస్తున్నారా? అని ప్రశ్నించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు.

First Published:  14 Nov 2022 12:39 PM GMT
Next Story