Telugu Global
National

రూ.5 వేలిస్తే.. 2 నిమిషాల్లో చంపేస్తాడు..! - గ‌త ప‌దేళ్లలో ఆస్ప‌త్రుల్లో 300 మంది రోగుల‌ హ‌తం

చెన్నై, బెంగ‌ళూరుల్లోనూ ఈ త‌ర‌హా హ‌త్య‌లు చేశాన‌ని మోహ‌న్‌రాజ్ ఆ వీడియోలో చెప్పాడు. రూ.5 వేలు ఇస్తే.. 2 నిమిషాల్లో ప‌ని పూర్తిచేస్తాన‌ని అందులో తెలిపాడు.

రూ.5 వేలిస్తే.. 2 నిమిషాల్లో చంపేస్తాడు..! - గ‌త ప‌దేళ్లలో ఆస్ప‌త్రుల్లో 300 మంది రోగుల‌ హ‌తం
X

త‌న‌కు రూ.5 వేలు ఇస్తే చాల‌ని.. రెండు నిమిషాల్లో చంపేస్తాన‌ని చెబుతున్నాడు త‌మిళ‌నాడు రాష్ట్రం నామ‌క్క‌ల్ జిల్లా ప‌ళ్లిపాల‌యానికి చెందిన మోహ‌న్‌రాజ్ (34). ఇదే విధంగా గ‌త ప‌దేళ్ల‌కాలంలో దాదాపు 300 మంది రోగుల‌ను హ‌త‌మార్చిన‌ట్టు చెప్పాడు. అత‌ను చెబుతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యం పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో అత‌నిపై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

మోహ‌న్‌రాజ్ ప‌ళ్లిపాల‌యానికి చెందిన ఆస్ప‌త్రి వ‌ద్ద నిత్యం సంచ‌రించేవాడు. మార్చురీ వ‌ద్ద ప‌నిచేసే వ్య‌క్తితో క‌లిసి అత‌ను చెప్పే ప‌నులు చేసేవాడు. వ‌యోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగుల‌ను వారి కుటుంబ స‌భ్యులు, బంధువుల కోరిక మేర‌కు సూదితో విష‌పు మందు ఇచ్చి హ‌త్య చేస్తున్న‌ట్టు అత‌ను తాజాగా స‌ర్క్యులేట్ అవుతున్న వీడియోలో వెల్ల‌డించాడు.

చెన్నై, బెంగ‌ళూరుల్లోనూ ఈ త‌ర‌హా హ‌త్య‌లు చేశాన‌ని మోహ‌న్‌రాజ్ ఆ వీడియోలో చెప్పాడు. రూ.5 వేలు ఇస్తే.. 2 నిమిషాల్లో ప‌ని పూర్తిచేస్తాన‌ని అందులో తెలిపాడు. అత‌న్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా, మ‌ద్యం మ‌త్తులో తాను అలా మాట్లాడాన‌ని చెప్పాడు. కానీ ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే పోలీసులు 18 మంది న‌కిలీ వైద్యుల‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. కేసు లోతుగా విచార‌ణ జ‌రిగితే మ‌రిన్ని నిజాలు వెలుగు చూసే అవ‌కాశం ఉంది.

First Published:  22 April 2023 3:34 AM GMT
Next Story