Telugu Global
National

బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు.. అమ్మాయి తల నరికిన వరుడు

కొన్ని గంటల తర్వాత ప్రకాష్ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. నిశ్చితార్థం ఆగిపోయిందన్న కోపంతో బాలిక తల్లిదండ్రులపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఇంట్లో నుంచి బాలికను బయటికి ఈడ్చుకెళ్లాడు.

బాలిక నిశ్చితార్థాన్ని ఆపిన అధికారులు.. అమ్మాయి తల నరికిన వరుడు
X

కర్ణాటక రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. మైనర్ బాలికతో నిశ్చితార్థం చేసుకుంటుండగా.. ఆ వేడుకను అధికారులు ఆపారన్న కోపంతో యువకుడు బాలిక తల నరికి చంపాడు. ఈ సంఘటన మడికేరిలో జరిగింది. 32 ఏళ్ల ప్రకాష్ అనే యువకుడు పదహారేళ్ల బాలికతో నిశ్చితార్థానికి సిద్ధమయ్యాడు. ఆ బాలిక రెండు రోజుల కిందటే పదో తరగతి పాస్ అయింది. గురువారం నిశ్చితార్థ వేడుక జరగాల్సి ఉంది. కాగా, దీని గురించి కొందరు చైల్డ్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న అధికారులు నిశ్చితార్థ వేడుకను అడ్డుకున్నారు.

అమ్మాయి వయసు తక్కువగా ఉందని పెళ్లి చేయవద్దని పెద్దలకు సూచించారు. ఒకవేళ వివాహం చేస్తే పోక్సో, బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు బాలికకు 18 ఏళ్లు వచ్చేవరకు నిశ్చితార్థ వేడుకను రద్దు చేయడానికి, పెళ్లిని వాయిదా వేయడానికి అంగీకరించారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రకాష్ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. నిశ్చితార్థం ఆగిపోయిందన్న కోపంతో బాలిక తల్లిదండ్రులపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఇంట్లో నుంచి బాలికను బయటికి ఈడ్చుకెళ్లాడు. ఆమె తల నరికి వెంట తీసుకెళ్లాడు. ఈ సంఘటన మడికేరి ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాలిక తల్లిదండ్రులను ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కొడుగు పోలీసు సూపరింటెండెంట్ కె. రామరాజన్ తెలిపారు.

First Published:  10 May 2024 2:08 PM GMT
Next Story