Telugu Global
International

భారత్ తో యుద్దం వద్దు, స్నేహం కావాలి ‍-పాక్ ప్రధాని ప్రకటన‌

"పాకిస్తాన్ బాంబులు, మందుగుండు సామగ్రి కోసం వనరులను వృథా చేయకూడదనుకుంటుంది, మేము అణు శక్తులు, విపరీతంగా ఆయుధాలు కలిగి ఉన్నాము. ఒక వేళ‌ యుద్ధం చెలరేగితే, ఆ తర్వాత‌ ఏమి జరిగిందో చెప్పడానికి ఎవరు జీవించి ఉంటారు?" అని ఆయన‌ అన్నారు.

భారత్ తో యుద్దం వద్దు, స్నేహం కావాలి ‍-పాక్ ప్రధాని ప్రకటన‌
X

కాశ్మీర్ వంటి బర్నింగ్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ, భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని, ఇప్పుడు ఆ దేశంతో శాంతిని కోరుకుంటున్నట్లు నొక్కి చెప్పారు.

"భారత నాయకత్వానికి, ప్రధాని మోడీకి నా సందేశం ఏమిటంటే, కాశ్మీర్ వంటి మన బర్నింగ్ పాయింట్‌లను పరిష్కరించడానికి మనం చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవించడం ద్వారా దేశాలను అభివృద్ధి చేసుకోవడమా లేదా పరస్పరం కలహించుకోవడం ద్వారా సమయం, వనరులను వృధా చేసుకోవడమా అనేది మన ఇష్టం." అని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

"మేము భారతదేశంతో మూడు యుద్ధాలు చేసాము. అవి ప్రజలకు మరింత కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని మాత్రమే తీసుకువచ్చాయి." అని అన్నారాయన‌

"మేము గుణపాఠం నేర్చుకున్నాము. మా మధ్య ఉన్న నిజమైన సమస్యలను మేము పరిష్కరించుకోగలిగితే, భారతదేశంతో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము" అని షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో అన్నారు.

షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, "పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుంది, అయితే కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని ఆపాలి" అని అన్నారు.

రెండు దేశాలలో ఇంజనీర్లు, వైద్యులు, నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. "మేము ఈ ఆస్తులను ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించాలనుకుంటున్నాము. రెండు దేశాలు అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావాలనుకుంటున్నాము." అన్నారాయన‌

"పాకిస్తాన్ బాంబులు, మందుగుండు సామగ్రి కోసం వనరులను వృథా చేయకూడదనుకుంటుంది, మేము అణు శక్తులు, విపరీతంగా ఆయుధాలు కలిగి ఉన్నాము. ఒక వేళ‌ యుద్ధం చెలరేగితే, ఆ తర్వాత‌ ఏమి జరిగిందో చెప్పడానికి ఎవరు జీవించి ఉంటారు?" అని ఆయన‌ అన్నారు..

ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్, ఆహార‌ సంక్షోభం, ఇంధన కొరత కారణంగా పాలకులపై ప్రజల్లో అసంతృప్తి, నిషేధిత సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) యొక్క ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాక్ ప్రధాని మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గత ఏడాది నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి చర్చలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తినందుకు పాకిస్తాన్‌పై భారతదేశం విరుచుకుపడింది. అబద్ధాలను ప్రచారం చేయడానికి పాకిస్తాన్ తీరని ప్రయత్నాలు చేస్తో‍ందని పేర్కొంది.

First Published:  17 Jan 2023 8:08 AM GMT
Next Story