Telugu Global
Cinema & Entertainment

డైరెక్ట‌ర్ శంక‌ర్‌.. ప‌ర్‌ఫెక్ట్ ప్లాన్‌.. - ఒకేసారి రెండు భారీ చిత్రాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీబిజీ

ఒక‌ప‌క్క క‌మ‌ల్‌హాస‌న్‌తో `ఇండియ‌న్‌-2` చిత్రం రూపొందిస్తూ.. మ‌రోప‌క్క రామ్‌చ‌రణ్‌తో మూవీని శ‌రవేగంగా పూర్తి చేస్తూ బిజీ షెడ్యూల్స్‌తో గడిపేస్తున్నాడు.

డైరెక్ట‌ర్ శంక‌ర్‌.. ప‌ర్‌ఫెక్ట్ ప్లాన్‌..  - ఒకేసారి రెండు భారీ చిత్రాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీబిజీ
X

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న లైఫ్‌లోనే ఫ‌స్ట్ టైమ్‌.. రెండు చిత్రాల‌కు ఒకేసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు. ఒక‌ప‌క్క క‌మ‌ల్‌హాస‌న్‌తో `ఇండియ‌న్‌-2` చిత్రం రూపొందిస్తూ.. మ‌రోప‌క్క రామ్‌చ‌రణ్‌తో మూవీని శ‌రవేగంగా పూర్తి చేస్తూ బిజీ షెడ్యూల్స్‌తో గడిపేస్తున్నాడు. సాధార‌ణంగా త‌న ఒక్కో చిత్రానికి దాదాపు రెండేళ్ల స‌మ‌యం తీసుకునే శంక‌ర్.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ రెండు చిత్రాల‌నూ వేర్వేరు తేదీలు కేటాయించి మ‌రీ షెడ్యూల్స్‌ పూర్తి చేస్తున్నాడు.

`ఇండియ‌న్‌-2` చిత్రాన్ని ప్రారంభించి కొంత షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత అనుకోని అవాంత‌రాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో షూటింగ్ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత కొద్ది గ్యాప్ అనంత‌రం రామ్‌చ‌ర‌ణ్‌తో చిత్రాన్ని ప్రారంభించిన శంక‌ర్‌.. ఆ చిత్రాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు. మ‌రోప‌క్క `ఇండియ‌న్‌-2` చిత్రం షెడ్యూల్ కూడా ఇటీవ‌ల ప్రారంభించిన శంక‌ర్ ఆ చిత్రం షూటింగ్ కూడా దీంతో పాటే ప్లాన్ చేసి పూర్తి చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో నెల‌లో మొదటి 10 రోజులు రామ్‌చ‌ర‌ణ్ చిత్రం షూటింగ్‌కి కేటాయిస్తున్నాడు. ఆ త‌ర్వాత ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి.. మ‌రో 10 రోజులు క‌మ‌ల్‌హాస‌న్ చిత్రం షూటింగ్ పూర్తిచేస్తున్నాడు. ఆ త‌ర్వాత మ‌రో ఐదు రోజులు రెస్ట్ తీసుకొని తిరిగి రామ్‌చ‌ర‌ణ్ చిత్రం షెడ్యూల్‌ని చేప‌డుతున్నాడు. ఈ విధంగా బిజీ బిజీ షెడ్యూల్స్‌తో శంక‌ర్ బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు.

ఇది ఒక‌ర‌కంగా ఆయ‌న అభిమానుల‌కు పండ‌గ లాంటిదే. తమ అభిమాన ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు రెండూ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి పూర్త‌యి.. థియేట‌ర్ల‌కు వ‌స్తే అభిమానుల‌కు అంది పండ‌గ‌లాంటిదే క‌దా. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్త‌వ‌గా, తాజాగా రాజ‌మండ్రిలో షూటింగ్ కొన‌సాగుతోంది. ఇక్క‌డ మ‌రో మూడు రోజుల షూటింగ్‌ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మూడు రోజుల షెడ్యూల్ పూర్త‌యితే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మొత్తం పూర్త‌యిన‌ట్టేన‌ని ఆ చిత్ర వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ చిత్రానికి సంబంధించి ఇంకా ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌, ఒక పాట‌, 10, 15 శాతం టాకీ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌లో షూటింగ్ ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఇందులో యాక్ష‌న్ సీక్వెన్స్ కోస‌మే 20 రోజులు ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

ఇక `ఇండియ‌న్‌-2` చిత్రం షూటింగ్ కేవ‌లం 35 శాతం మాత్ర‌మే పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ముందుగా చ‌ర‌ణ్ సినిమాను పూర్తిచేసి.. స‌మ్మ‌ర్‌లోపు విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత శంక‌ర్ క‌మ‌ల్ చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోక‌స్ చేయ‌నున్నారు.

First Published:  24 Dec 2022 6:43 AM GMT
Next Story