Telugu Global
Arts & Literature

నేను - నాది

నేను - నాది
X

కన్నతల్లి కడుపులోంచి బయటపడి,

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే ‘నేను!’

ఈ ‘నేను’* ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు!ఊపిరి ఉన్నంతదాకా ‘నేను’

అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది.

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ ‘ నేను’ లోంచే

‘నాది’అనే భావన పుడుతుంది!

ఈ ‘నాది’ లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప...

అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ ’నేను’అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి,

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి

‘అహం ‘గా ప్రజ్వరిల్లుతుంది.

‘అహం’ అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ ’నేను’ నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ‘నేను’ అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

సుందరీ మణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను

చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం,

కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.‘నేనే’శాసన కర్తను, ‘నేనే ‘ఈ భూమండలానికి అధిపతిని,

‘నేనే’జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ‘నేను’లేకుండానే మళ్ళీ

తెల్లవారుతుంది. రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ‘నేను’కథ అలాసమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ‘నేను’గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే.

అది శాశ్వతం కానే కాదు.

‘నేను’ గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం! తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం!

స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే ‘నరకం!’

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే ‘స్వర్గం!’ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

‘అహం బ్రహ్మాస్మి’అంటే

అన్నీనేనే అనే స్థితి నుంచి ‘త్వమేవాహమ్‌’అంటే- నువ్వేనేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే

మానవజన్మకు సార్థకత!

- భావన

First Published:  31 May 2023 7:40 AM GMT
Next Story