Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసు విచారణకు నేడే ఆఖరి రోజు

ఇప్పుడు మళ్లీ గడువు పొడిగించాలనే సీబీఐ అభ్యర్థనను సుప్రీం మన్నిస్తుందో లేదో చూడాలి. మొత్తమ్మీద జులై-3 వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగే అవకాశముంది.

వివేకా హత్య కేసు విచారణకు నేడే ఆఖరి రోజు
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సీబీకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తుంది. గడువు పూర్తవుతున్నా ఫలితం లేదని ఈపాటికే తేలిపోయింది. విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విచారణ విషయంలో కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లపైనే సందిగ్ధం కొనసాగుతున్న వేళ, దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని కూడా చెప్పలేం. ఈ సందర్భంలో సీబీఐ, సుప్రీంకోర్టుకి ఏమని చెబుతుంది, గడువు పొడిగించాలని అభ్యర్థిస్తుందా, కొత్త డెడ్ లైన్ ని తానే ప్రతిపాదిస్తుందా..? జులై 3న తేలే అవకాశముంది.

జులై-3న ఎందుకంటే..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ తీసుకున్న అవినాష్ రెడ్డి క్రమం తప్పకుండా ప్రతి వారం సీబీఐ ముందు హాజరవుతున్నారు, విచారణకు సహకరిస్తున్నారు. అయితే అర్జంట్ గా ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. జులై-3కి విచారణ వాయిదా పడింది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో కచ్చితంగా సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

జులై 3న సుప్రీంకోర్టుకు కేసు దర్యాప్తు పురోగతిని సీబీఐ వివరించి సమయం కోరే అవకాశముంది. నిందితుడు భాస్కర్‌ రెడ్డి సహా మరో ఇద్దరిపై త్వరలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. గతంలో విచారణ అధికారిని మార్చే క్రమంలో కొత్తగా గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మళ్లీ గడువు పొడిగించాలనే సీబీఐ అభ్యర్థనను సుప్రీం మన్నిస్తుందో లేదో చూడాలి. మొత్తమ్మీద జులై-3 వివేకా హత్యకేసుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగే అవకాశముంది.

First Published:  30 Jun 2023 5:43 AM GMT
Next Story