Telugu Global
Andhra Pradesh

ఎన్నికల ముందు అవినాష్ రెడ్డికి ఊరట

నిందితుడు దస్తగిరి ఇలాంటి పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమే అయినా అతడి వెనక ఉంది టీడీపీ కాబట్టి.. ఇలాంటి కుట్రపూరిత చర్యలను ఊహించవచ్చు.

ఎన్నికల ముందు అవినాష్ రెడ్డికి ఊరట
X

ఎన్నికల వేళ కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్షాలు చేసిన, చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ విఫలమవుతున్నాయి. తాజాగా ఆయనకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్య కేసులో ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్ లో ఉండగా, ఆ బెయిల్ కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ని ఈరోజు కోర్టు కొట్టివేసింది. దీంతో అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్టయింది.

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుమానితుడే కానీ, నిందితుడు కాదు. నేరం రుజువు కాకపోయినా, కేసు విచారణ దశలో ఉన్నా కూడా పదే పదే అవినాష్ రెడ్డిపై నిందలు వేస్తూ, ఆయన్ను హంతకుడిగా పేర్కొంటూ ఎల్లో బ్యాచ్ కుట్ర రాజకీయాలు చేస్తోంది. షర్మిల, సునీత కూడా తమ ప్రచారంలో కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం తగదని, ఇకపై ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యకేసు ప్రస్తావన ఉండకూడదని ఆమధ్య కడప కోర్టు ఉత్తర్వులిచ్చింది. కానీ ఎల్లో బ్యాచ్ మాత్రం ఆ పని ఆపలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వివేకా హత్యకేసుని ప్రస్తావిస్తూనే ఉన్నారు. అంతే కాదు, అవినాష్ బెయిల్ రద్దు చేయించేందుకు కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రస్తుతం అప్రూవర్ గా ఉన్న దస్తగిరి.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిందితుడు ఇలాంటి పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమే అయినా అతడి వెనక ఉంది టీడీపీ కాబట్టి.. ఇలాంటి కుట్రపూరిత చర్యలను ఊహించవచ్చు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బెయిల్ రద్దుకోరుతూ వేసిన పిటిషన్ ని కొట్టివేసింది.

మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.

First Published:  3 May 2024 6:32 AM GMT
Next Story