Telugu Global
Andhra Pradesh

కొడాలి నాని.. రామోజీని కడిగేశాడుగా..! – ‘ఈనాడు’ వార్తపై ఘాటు లేఖ

చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప, రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది? చంద్రబాబునాయుడుకు అయినా, పవన్‌ కళ్యాణ్‌కు అయినా, సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుందని నిలదీశారు.

కొడాలి నాని.. రామోజీని కడిగేశాడుగా..! – ‘ఈనాడు’ వార్తపై ఘాటు లేఖ
X

కొడాలి నాని.. రామోజీని కడిగేశాడుగా..! – ‘ఈనాడు’ వార్తపై ఘాటు లేఖ

కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు మృతిచెందిన ఘటనను కూడా రాజకీయం చేస్తూ ‘ఈనాడు’లో కథనం వండివార్చడంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఈనాడు అధిపతి రామోజీరావును ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఏపీ కార్మికులు కర్ణాటకలో చనిపోయిన ఘటనపై ఈనాడులో రామోజీరావు ’ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా?’ అంటూ రాసిన కథనంపై శుక్రవారం ఆయన ఈ లేఖ ద్వారా ఘాటుగా స్పందించారు.

రామోజీరావు ముందుగా ఆయన బాధేంటో చెప్పాలని కొడాలి నాని తన లేఖలో నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడమా? ఇంకెప్పటికీ ఆయన అధికారంలోకి రాడన్న ఆక్రోశమా? లేక మీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రశ్నించిందన్న తట్టుకోలేనితనమా? వీటిపై ప్రజలకు సమాధానాలు చెప్పితీరాలని డిమాండ్‌ చేశారు. ఒక రాష్ట్రం వారు, ప్రత్యేకించి సరిహద్దుల్లో ఉన్నవారు మరో రాష్ట్రంలో పనులకు వెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచీ జరుగుతోందని, అది చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్లడం సర్వసాధారణమేనని ఆయన పేర్కొన్నారు.

ఉదాహరణకు ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజూ కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారని, అలాగే, ఒడిశా నుంచి ఉత్తరాంధ్రకు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వలస వస్తారని వివరించారు. దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి రాత్రికి వెళ్లిపోతే.. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటారని తెలిపారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలేనని పేర్కొన్నారు.

కానీ, కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే.. ఇక్కడ ఉపాధి లేక వారు వెళ్లిపోయారా? లేక అక్కడ మెరుగైన ఉపాధి ఉందని వెళ్లారా? అని కనీసం వారి వివరణ కూడా లేకుండా రామోజీరావు రాశారని గుర్తుచేశారు. ఇది ఎంతవరకు సమంజసమని నిలదీశారు. దురుద్దేశపూర్వకంగా రాసినట్లు కన్పించటం లేదా రామోజీ? ఇలా రాస్తే ప్రజలు విశ్వసిస్తారా? ఒకసారి ఆలోచించండి అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో ఏటా కరువే..

ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరం లేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని గుర్తుచేశారు. ఆయన హయాంలో ఏటా కరువేనని, ఒక్క 2016నే తీసుకున్నా.. రాయలసీమ నుంచే 6 లక్షల నుంచి 10 లక్షల మంది వ్యవసాయం చేసుకుంటున్న వారంతా వలసపోయారని అప్పట్లో ఆంగ్ల దినపత్రికలే రాశాయని తెలిపారు. ఆరోజు వారంతా వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలసపోతే.. రామోజీ మాత్రం ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉద్యమం చేశారు తప్ప, ఇక్కడే ఉపాధి దొరికి ఉంటే.. ఇన్ని లక్షల రైతు కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారేవారా? అని ఏనాడూ ప్రశ్నించలేదని నిలదీశారు.

మరి తేడా ఎక్కడుంది? రామోజీరావు దగ్గరే.. ఆయన మనస్సులో, ఆలోచనల్లో, రాతల్లోనే తేడా ఉందని పేర్కొన్నారు. ఇక గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్‌ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబు 29 మందిని చంపేశారని, నిజానికి.. ఆ రోజు అది బాబు చేసిన ఘోరమేనని, కానీ చేసింది బాబు కాబట్టి అది నేరమైనా ఘోరమైనా రామోజీకి కమ్మగా కనిపిస్తోంది, తియ్యగా అనిపిస్తోందని మండిపడ్డారు.



భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్టపరిహారాన్ని, పైగా వేరే రాష్ట్రంలో ప్రమాదం జరిగినా ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద, మానవతా సాయం విషయంలో ఏమాత్రం వెనుకాడని నాయకుడి మీద.. తనవాడు కాదు.. గిట్టనివాడు కాబట్టి రాళ్లు వేస్తారా? మరీ ఇంత దుర్మార్గమా రామోజీ? మిగతా రాష్ట్రాలకు వెళ్లడం ఘోరం, నేరం అంటున్న వారు.. మీ తోటి ఎల్లో మీడియా అధిపతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. అసలు మా రాష్ట్రంతో, మీ సొంతూళ్లతో మీకున్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు.

చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప, రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది? చంద్రబాబునాయుడుకు అయినా, పవన్‌ కళ్యాణ్‌కు అయినా, సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుందని నిలదీశారు. పవన్‌ కళ్యాణ్‌ తమ్ముడిలా రోజూ మీ ఈనాడులో జగన్‌ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధించి ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ వెన్నుపోటు నాడే పత్రికా విలువలను హారతి పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు సమర్పించేసుకున్నారని, ఇప్పుడు రామోజీరావు మానవతా విలువల్ని కూడా అదే పద్ధతిలో వదిలేసుకున్నారని స్పష్టం చేశారు. కాస్తంత మానవత్వాన్ని అయినా ఈ 90 ఏళ్ల వయసులో మీరు నిలుపుకోవాలి రామోజీ.. అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

First Published:  28 Oct 2023 7:39 AM GMT
Next Story