Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఒక వ్యాపార సంస్థ.. - బాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డ రాయపాటి

తమ వద్ద కోట్ల కొద్దీ సొమ్ము కొల్లగొట్టారని రాయపాటి రంగారావు విమర్శించారు. గత ఎన్నికల్లో తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

టీడీపీ ఒక వ్యాపార సంస్థ.. - బాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డ రాయపాటి
X

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు రాయపాటి రంగారావు.. చంద్రబాబు, లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బాబు, లోకేష్‌ల తీరును ఎండగట్టారు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని, అది ఒక వ్యాపార సంస్థ అని ఆయన విమర్శించారు. 2014లో తాను, తన తండ్రి రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

బాబు, లోకేష్‌.. కోట్ల కొద్దీ సొమ్ము కొల్లగొట్టారు..

తమ వద్ద కోట్ల కొద్దీ సొమ్ము కొల్లగొట్టారని రాయపాటి రంగారావు విమర్శించారు. గత ఎన్నికల్లో తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. లోకేష్‌ మాట్లాడితే.. డబ్బు.. డబ్బు.. డబ్బు.. అంటాడని ఆయన చెప్పారు. పోలవరం కాంట్రాక్టు కాంగ్రెస్‌ హయాంలో తమకు ఇచ్చారని, అయినా చంద్రబాబు తమ వద్ద సబ్‌ కాంట్రాక్టుల పేరుతో డబ్బు కొల్లగొట్టాడని మండిపడ్డారు.

లోకేష్‌ని ఓడించడమే లక్ష్యం..

మంగళగిరిలో లోకేష్‌ని ఓడించడమే తన లక్ష్యమని రాయపాటి రంగారావు స్పష్టంచేశారు. మంగళగిరిలో ఆయన ఓటమికి తాను కచ్చితంగా కృషిచేస్తానని ఆయన తెలిపారు. తమ వద్ద చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ డబ్బు తీసుకున్నారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. టీవీ చర్చకు వస్తే అన్నీ వెల్లడిస్తామని ఆయన స్పష్టంచేశారు. తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ వారు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం చెబితే అక్కడి నుంచి పోటీ చేస్తానని రాయపాటి రంగారావు ఈ సందర్భంగా తెలిపారు.

First Published:  13 Jan 2024 3:17 AM GMT
Next Story